హుజూరాబాద్‌లో దళితబంధుకు 500 కోట్లు | Telangana Releases Rs 500 Crore For Dalit Bandhu In Huzurabad | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌లో దళితబంధుకు 500 కోట్లు

Aug 10 2021 4:34 AM | Updated on Aug 10 2021 4:34 AM

Telangana Releases Rs 500 Crore For Dalit Bandhu In Huzurabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దళితబంధు పథకం అమలు మరింత వేగవంతమైంది. గతవారం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.6 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు అమలు కోసం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వాసాలమర్రి గ్రామం వరకు ప్రాథమికంగా విడుదల చేసిన మార్గదర్శకాలనే ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ను ఆదేశించారు. దీంతో కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (వీసీఎండీ) బీఎస్‌ఎస్‌ భవన్‌లోని భారతీయ స్టేట్‌ బ్యాంకుకు లేఖ రాశారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌కు రూ.500 కోట్లు ఎలక్ట్రానిక్‌ క్లియరెన్స్‌ పద్ధతిలో విడుదల చేయాలంటూ రెండు చెక్కులతో కూడిన లేఖను సమర్పించారు. దీంతో బ్యాంకు నుంచి నిధులు జిల్లా కలెక్టర్‌ ఖాతాలో జమ అయ్యాయి.   

Advertisement
 
Advertisement
Advertisement