మల్లారెడ్డికి మరో షాక్‌.. భూకబ్జా కేసు నమోదు | Another Case Filed Against Ex Minister Malla Reddy | Sakshi
Sakshi News home page

మల్లారెడ్డికి మరో షాక్‌.. భూకబ్జా కేసు నమోదు

Jun 14 2024 12:22 PM | Updated on Jun 14 2024 1:48 PM

Telangana Latest News: Another Case Filed Against Ex Minister Malla Reddy

హైదరాబాద్‌, సాక్షి: మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికు మరో షాక్‌ తగిలింది. పేట్‌బషీర్‌బాద్‌ పోలీసులు ఆయనపై భూకబ్జా కేసు నమోదు చేశారు. మొత్తం ఏడు సెక్షన్లతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపైనా కేసు నమోదయినట్లు సమాచారం.

పేట్‌ బషీర్‌బాద్‌లో 32 గుంటల భూమిని కబ్జా చేశారని, ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శేరి శ్రీనివాస్‌రెడ్డి పేట్‌బషీర్‌బాద్‌ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.

ఆ వివాదం మరిచిపోకముందే..
ఇటీవలె సుచిత్ర సర్కిల్ సమీపంలోని మిలటరి కాంపౌండ్ వాల్ రోడ్డులో మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల సర్వే నెంబర్ 82లోని భూమిలో గత నెల 18వ తేదీన మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి జోక్యంతో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. ఆ సమయంలో మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్‌ చేసి పేట్‌ బషీర్‌బాద్‌ జైలుకు సైతం తరలించారు. 

మరోవైపు.. ఈ భూవివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది కూడా. దీంతో ఈ వివాదాస్పద భూమిలో అధికారులు ఒకటికి రెండుసార్లు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారులు 33 గుంటలు మల్లారెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు తేల్చారు. సర్వే నెంబరు 82లోని 33 గుంటల భూమిని ఆయన కబ్జా చేసినట్లు కోర్టుకు నివేదిక అందజేశారు. ఇక.. అయితే ఈ వివాదంలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు చివరకు.. మేడ్చల్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈలోపే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement