గురుకులాలకు 'ఖాళీ' గుబులు! | Telangana Govt Neglected Welfare Gurukul Schools | Sakshi
Sakshi News home page

గురుకులాలకు 'ఖాళీ' గుబులు!

May 26 2025 5:35 AM | Updated on May 26 2025 5:35 AM

Telangana Govt Neglected Welfare Gurukul Schools

అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలు ఖాళీ చేయాలంటున్న యజమానులు 

రూ.215 కోట్లకు చేరిన బకాయిలు

10 నెలలుగా పైసా విదల్చని ప్రభుత్వం 

63 భవనాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లకు యజమానుల స్పష్టీకరణ 

కొన్నిచోట్ల గేట్లకు తాళాలు! 

ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవ్వాలనే యోచన

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో అద్దె బకాయిల అంశం గుబులు పుట్టిస్తోంది. దాదాపు పది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించక పోవడంతో భవనాలు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు అద్దెకు సంబంధించిన ఒప్పందం గడువు ముగియడంతో తమ భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఇప్పటికే 63 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు యజమానులు కరాఖండిగా తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో గురుకుల సంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ బకాయిలు పెద్దయెత్తున పేరుకుపోవడం, ప్రైవేటుకు ఇచ్చుకుంటే నెలా నెలా అద్దె ఠంఛనుగా వసూలు చేసుకోవచ్చని యజమానులు భావిస్తున్నట్లు తెలిసింది. మైనారిటీ గురుకులా ల్లోనూ అద్దెలు ఏడాదికి పైగా పెండింగ్‌లోనే ఉన్నాయి.

అద్దె లేదు.. నిర్వహణ భారం 
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని భవనాల యజమానులు ఎక్కువగా గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని భవనాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో అద్దె సక్రమంగా రాని గురుకుల పాఠశాలలకు బదులుగా ఇతర ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అద్దెకిస్తే అద్దె నెలవారీ వస్తుందని, పైగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో యజమానులు తమ భవనాలు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఏటా అద్దె పెంపు సైతం నిలిచిపోవడం కూడా ఇందుకు మరో కారణంగా కన్పిస్తోంది. 

ఇంకోవైపు భవనాలకు రెగ్యులర్‌ రిపేర్లు, కొన్ని గురుకులాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చి సరఫరా చేయాల్సి ఉండటంతో యజమానులకు ఇబ్బందికరంగా మారుతోంది. నెలవారీ అద్దెబిల్లు రాకపోగా.. ప్రతినెలా సొంతంగా ఖర్చులు భరించాల్సి రావడంతో వాటిని ఖాళీ చేయించడమే ఉత్తమం అని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు భవనాల యజమానులు భావిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా భవనాలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రిన్స్‌పల్స్‌కు స్పష్టం చేశారు. కొంతమంది యజమానులు ఇప్పటికే భవనాల గేట్లకు తాళాలు వేసినట్లు క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.  

అద్దె భవనాల్లో 662 గురుకులాలు
ప్రస్తుతం గురుకులాల అద్దె బకాయిలు రూ.215 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సొసైటీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కాగా యజమానులు గురుకుల సొసైటీలపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే యజమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా..విద్యాశాఖ పరిధిలో జనరల్‌ గురుకుల సొసైటీ ఉంది. 

వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇందులో 662 విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి నెలకు సుమారు రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో మొత్తం బకాయిలు రూ.215 కోట్లకు చేరాయి. వీటిని విడుదల చేయాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదని యజమానులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement