
2023 జనవరి 1 నుంచి వర్తింపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
30.03 శాతానికి చేరిన మొత్తం డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచింది. పెంచిన డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం జారీచేసిన జీవోలు 78, 79లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39 శాతం ఇస్తుండగా.. తాజాగా పెంపుతో 30.03 శాతానికి చేరుతుంది.
తాజాగా పెంచిన డీఏను జూన్ నెల వేతనంతో జూలైలో ఇస్తారు. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లిస్తారు.
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు 10 శాతం డీఏ బకాయిలను ప్రాన్ ఖాతాల్లో జమచేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 1 జూలై 2023 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ఆరు నెలల తర్వాత జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.