ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలి | Telangana: Farmers Stage Protest Demanding Reopening Of Sugar Factory | Sakshi
Sakshi News home page

ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలి

Oct 13 2021 1:54 AM | Updated on Oct 13 2021 1:54 AM

Telangana: Farmers Stage Protest Demanding Reopening Of Sugar Factory - Sakshi

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు   

మెట్‌పల్లి: ముత్యంపేట నిజాం దక్కన్‌ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రైతులు కదం తొక్కారు. మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాతోపాటుగా జిల్లా నలుమూలలనుంచి ఈ మహాధర్నాకు రైతులు తరలివచ్చి అక్కడి జాతీయ రహదారిపై బైఠాయించారు.

ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సక్రమంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌..గద్దెనెక్కిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోకపోగా మూసివేసిందని దుయ్యబట్టారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం.. చక్కెర ఫ్యాక్టరీని తెరిస్తే వరి స్థానంలో చెరుకు పంటను సాగు చేయడానికి ఇక్కడి రైతాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల ధర్నా సమాచారం అందుకున్న కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్‌ వారి వద్దకు చేరుకున్నారు. రైతులు ఆయనకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement