పలు ప్రాంతాల్లో భూకంపం | Telangana: Earthquake Occurred In Peddapalli Jagtial Adilabad District | Sakshi
Sakshi News home page

పలు ప్రాంతాల్లో భూకంపం

Nov 1 2021 1:02 AM | Updated on Nov 1 2021 1:15 AM

Telangana: Earthquake Occurred In Peddapalli Jagtial Adilabad District - Sakshi

హాజీపూర్‌ మండలం నర్సింగాపూర్‌లో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు   

జగిత్యాల/రామగుండం/మొగుళ్లపల్లి/మల్హర్‌/మంచిర్యాలటౌన్‌: రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఆదివారం స్వల్పంగా భూమి కంపించింది. 3 నుంచి 5 సెకన్లపాటు కంపించడంతో ఆయా జిల్లాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యా రు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాయం త్రం 6.48 గంటల సమయంలో 5 సెకన్లపాటు భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, బీర్‌పూర్, రాయికల్, గొల్లపల్లి మండలాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరు గులు తీశారు.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అంతర్గాం, ముత్తారం మండలాల్లో భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి.  జయశంకర్‌ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో భూమి 3 సెకన్ల పాటు.. మల్హర్‌ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలం రేకంపల్లిలో, కొత్తపల్లి(బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 2 సెకన్లపాటు భూమి కంపించింది.  

మంచిర్యాల జిల్లాలో... 
మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ ఆదివారం సాయంత్రం 6:48 గంటల సమయంలో 3 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ, ఐబీ ప్రాంతం, నెన్నెల మండలం చిత్తాపూర్, జంగాల్‌పేటలో, హాజీపూర్‌ మండలం నర్సింగాపూర్‌లో, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, దండేపల్లి, భీమారం మండలాల్లోనూ భూమి కంపించింది.

మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా భూమి కంపించి రిక్టర్‌ స్కేల్‌పై 4.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. అక్టోబర్‌ 23న కూడా వీటిల్లోని కొన్నిప్రాంతాల్లో భూకంపం సంభవించింది. వారం తర్వాత మళ్లీ భూమి కంపించడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement