ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. గంజాయి సిండికేట్ గుట్టురట్టు | Telangana EAGLE Force Busts Mega International Hydroponic Ganja Network | Sakshi
Sakshi News home page

ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. గంజాయి సిండికేట్ గుట్టురట్టు

Jun 4 2026 1:09 PM | Updated on Jun 4 2026 1:09 PM

Telangana EAGLE Force Busts Mega International Hydroponic Ganja Network

హైదరాబాద్‌: తెలంగాణలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్స్ విభాగం ‘ఈగల్ ఫోర్స్’ (EAGLE Force) విజయవంతంగా ఛేదించింది. బ్యాంకాక్ కేంద్రంగా హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాలకు హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న భారీ సిండికేట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మెరుపు దాడిలో భాగంగా అధికారులు కోట్లాది రూపాయల విలువైన 13 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 40 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు.

మూడు నెలల రహస్య ఆపరేషన్
కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. దాదాపు మూడు నెలల పాటు అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా సాగిన ఈ నిఘా ప్రక్రియలో డ్రగ్స్ ముఠా కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పసిగట్టారు. చివరకు పక్కా ఆధారాలతో ఉచ్చు బిగించి, అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా చైన్‌ను చేదించగలిగారు.

చిక్కిన ప్రధాన సూత్రధారులు 
ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన సోధా మోసిన్ బహదూర్‌భాయ్, సోధా మోసిన్, హర్షద్ మన్సుఖ్‌భాయ్ ప్రజాపతి అనే ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుండి భారతదేశానికి ఈ మత్తు పదార్థాలను అక్రమంగా తరలించడంలో వీరు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

200 మందితో భారీ నెట్‌వర్క్
ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన వివరాలను ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్, ఇతర భారతీయ నగరాలకు హైడ్రోపోనిక్ గంజాయిని సరఫరా చేసే ఈ నెట్‌వర్క్‌లో సుమారు 200 మంది వరకు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సిండికేట్‌లో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement