తెలంగాణ ప్రజల భద్రతకు, జంతు సంక్షేమానికి ప్రాధ్యానత ఇస్తూ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఊరేగింపులకు, సినిమా షూటింగ్లకు సజీవ ఏనుగులను వినియోగించేవారు. అయితే జంతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ..పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) బహుమతిగా ఇచ్చిన రొబొటిక్ ఏనుగును స్వాగతించారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.
ఈ మేరకు గురువారం గుర్రంగుడ ఎకో పార్కులో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా ప్రారంభమైన రొబోటిక్ ఏనుగు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ రోబోటిక్ ఏనుగును నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
సుమారు రూ. 10 లక్షలు విలువ చేసే ఈ రోబోటిక్ ఏనుగును పెటా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖకు బహుమతిగా ఇచ్చింది. కాగా, పెటా మత, సాంస్కృతిక కార్యక్రమాలలో సజీవ ఏనుగుల వాడకానికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కేరళలోని ప్రముఖ దేవాలయాలకు 10కి పైగా రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
(చదవండి: నా సరస్వతిరేఖ మా నాన్న!)


