నా సరస్వతిరేఖ మా నాన్న! | "My Father The True Architect Of My Life...": The Life Story Goreti Venkanna Shared About His Father, Read Insights | Sakshi
Sakshi News home page

నా సరస్వతిరేఖ మా నాన్న!

Jun 19 2026 9:05 AM | Updated on Jun 19 2026 9:59 AM

The Life Story Goreti Venkanna Shared About His Father

గోరటి వెంకన్న

తండ్రి గోరటి నర్సింహ

మా నాన్న గోరటి నర్సింహ చిన్న రైతు. చెరువు శికం భూమి ఎకరా, భూదాన ఉద్యమం వల్ల వచ్చిన భూమి ఎకరా, పొత్తుల మాన్యం అర ఎకరా... ఆయన ఆస్తి. ఆ రెండున్నర ఎకరాల్లో సేద్యం చేసేవాడు. ఆ తర్వాత ఎప్పుడో కోమట్ల సలహాతో మరో మూడెకరాలు కొని ఐదున్నర ఎకరాల రైతు అయ్యాడు. మా నాన్న భూమమ్మకు కష్టం చేస్తూ బతికాడు. మా ఊర్లో బావులు తవ్వినప్పుడు తేమ కనపడితే అది నీటి జల కాదు మా నాన్న ఓడ్చిన చెమట అనుకునేవాణ్ణి. జొన్నలు, పల్లికాయలు... లేదంటే కుసుమ పంటలు అవి వేసి బతికాడు మా నాన్న. 1971లో పెద్ద కరువు వచ్చి ఊళ్లో పెద్ద పెద్ద ఇళ్లలోనే బియ్యపు గింజలు ఉండేవి కావు. కాని మా ఇంట్లో ఉండేవి. అంత పొదుపుగా బతికారు మా అమ్మ, నాన్న.

మా నాన్న యక్షగాన కళాకారుడు. నాటకాలు వేసేవాడు. బడి చదువు లేకపోయినా నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకున్నాడు. శతక పద్యాలు చెప్పేవాడు. పోతన భాగవతం పలికేవాడు. హరిశ్చంద్రుడి వేషం వేశాడో లేదోగాని హరిశ్చంద్రుడి కంటే నైతికవర్తనుడు. ఆయన నోటిగుండా అబద్ధం పలికినట్టు నేను చూడలేదు. ఉందంటే ఉంది. లేదంటే లేదు. మా నాన్నను ఊళ్లో బహు చక్కని మనిషి అనేవారు. మట్టిలో నుంచి బయల్పడ్డ రంగనాథస్వామి విగ్రహంలా ఉండేది ఆయన రూపం. మితభాషి. ఆయన ఉన్నచోట ఉత్సాహం, ఆనందం ఉండేవి. సందర్భానుసారం హాస్యం పండేది.

మా నాన్నకు అంబేద్కర్‌ తెలియదుగాని చదువు వల్ల బతుకు మారుతుందని తెలుసుకున్నాడు. పిల్లల్ని చదివించాలని పట్టుబడ్డాడు. మేమంతా స్కూలుకు పోతుంటే ఊళ్లో పెద్దలు ‘నువ్వెందుకు ఒక్కడివే కష్టపడతావు. చదువుకొని కొలువుచేసేదుందా. పిల్లల్ని చేతి కిందకు తీసుకో’ అనేవారు. కాని మా నాన్న చదివియ్యాల్సిందే అనుకున్నాడు. నాకు చదువు మీద ధ్యాస లేదు. మా ఊరు (నాగర్‌ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామం)లో తల్లిదండ్రులతో, బంధువుల మధ్య, పశువులు కాచుకుంటూ హాయిగా ఉండాలని ఉండేది. మా ఊళ్లో మూడో క్లాసు దాకానే స్కూలు ఉంటే దుందుభికి అవతలి వైపు రఘుపతిపేట్‌కు వెళ్లి హాస్టల్‌లో చేరాలంటే ఏదో విదేశానికి వెళ్లినట్టు ఉండేది. అక్కడకు వెళ్లి హాస్టల్‌లో చేరి, అర్ధరాత్రిళ్లు దెయ్యాలుంటాయనే నెపం పెట్టి ఏడుస్తుంటే మా నాన్న సాయంత్రం మాఊరి నుంచి రఘుపతిపేట్‌లోని మా హాస్టల్‌కు వచ్చి నాకు తోడు పడుకుని మళ్లీ ఉదయాన్నే ఊరికి వెళ్లేవాడు. మమ్మల్ని ఏనాడూ కొట్టింది తిట్టింది లేదు. చలం బిడ్డల శిక్షణ చదవకనే పిల్లల్ని ఎలా పెంచాడో తెలుసుకున్నవాడు. తాను, అమ్మ ముతకబియ్యం తిని మేం హాస్టల్‌ నుంచి వచ్చినప్పుడు సన్నబియ్యం వండి పెట్టేవారు.

నా చిన్నప్పుడు మా ఊరికి ఒక కాశీ బ్రాహ్మణుడు వచ్చి అందరికీ చేయి చూసి ఫలానా ఫలానా అని చెప్పి మా నాన్న చేయి చూశాడు. మా నాన్నతో ‘నీ కొడుకు వెయ్యి రూపాయిల జీతగాడవుతాడు’ అని చెప్పాడు. ఊళ్లో అందరూ పరాచికాలాడారు ఆ మాటకు అయ్యేదా చచ్చేదా అని. మా నాన్న మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆయన చదివిస్తే ఎం.ఏ. వరకూ చదివాక నాకు ఉద్యోగం వచ్చింది. జోస్యంలో చెప్పినట్టు వేల జీతం వచ్చింది. మా నాన్న నా ఉద్యోగం చూశాడు. ఎదుగుదల చూశాడు. ఆయన వల్ల నాకు అబ్బిన పద్యం, పాట, గాత్రంతో నేను ఉనికిలోకి రావడం చూశాడు. నేను 49వ ఏట ఉండగా నన్ను విడిచి వెళ్లాడు.

ఇప్పటికీ ఆయన ముద్ద ముద్దకూ గుర్తుకు వస్తాడు. ఆనందంలో, దుఃఖంలో, ఆలోచనలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నట్టే ఉంటాడు. నీడ వలే కాపాడుతూనే ఉన్నాడు. ఆయన నాకు దివ్యరూపం. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మార్గం చూపుతూనే ఉన్నాడు. మా నాన్న చదువు చెప్పించి నా జీవితాన్ని తీర్చిదిద్దినవాడు. ఆయనే నా చేతిలోని సిసలైన సరస్వతిరేఖ. – గోరటి వెంకన్న కవి, వాగ్గేయకారుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement