తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు | Telangana Bags 2 Awards In National Maternal Health Workshop | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు.. మంత్రి హరీశ్‌ హర్షం

Dec 15 2022 9:38 AM | Updated on Dec 15 2022 3:41 PM

Telangana Bags 2 Awards In National Maternal Health Workshop - Sakshi

కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్‌ మెటర్నల్‌ హెల్త్‌ వర్క్‌ షాప్‌‘లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్‌ మెటర్నల్‌ హెల్త్‌ వర్క్‌ షాప్‌‘లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌పవార్‌ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్‌ డైరెక్టర్‌ (మెటర్నల్‌ హెల్త్‌) డాక్టర్‌ ఎస్‌ పద్మజ అవార్డులు అందుకున్నారు. 

మిడ్‌ వైఫరీ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు 
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్‌ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్‌ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్‌ వైఫరీలను ప్రభుత్వం 49 ఆస్పత్రుల్లో నియమించింది. ఇక హైరిస్క్‌ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

హైరిస్క్‌ గర్భిణులను ముందస్తుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం ( ట్రాకింగ్‌), ఉత్తమ చికిత్స అందేలా రిఫర్‌ చేయడంకోసం వైద్య అధికారులు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. దీంతో హై రిస్క్‌ కేసులను ముందుగా గుర్తించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం కలిగింది. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్, అమ్మఒడి వాహన సేవలు గర్భిణులకు వరంగా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. 

చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి:  హరీశ్‌
‘‘సీఎం కేసీఆర్‌ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం. 2014లో 92గా ఉన్న ఎంఎంఆర్‌ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్‌ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉందని’ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

ఇదీ చదవండి: Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement