సైట్‌ చూడకుండానే డిజైన్లు! | technical details given by CE Nalla Venkateshwarlu are basis for designs | Sakshi
Sakshi News home page

సైట్‌ చూడకుండానే డిజైన్లు!

Aug 24 2024 6:10 AM | Updated on Aug 24 2024 6:10 AM

technical details given by CE Nalla Venkateshwarlu are basis for designs

సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సాంకేతిక వివరాలే డిజైన్లకు ఆధారం

సుందిళ్ల బరాజ్‌ అదనపు గేట్లకు డిజైన్లు ఇవ్వలేదు

క్షేత్రస్థాయి ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారు

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో సీడీవో రిటైర్డ్‌ ఎస్‌ఈ ఫజల్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపాదిత నిర్మిత స్థలాన్ని(సైట్‌) సందర్శించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బరాజ్‌ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఇంజినీర్లు రూపొందించా రని ఆ విభాగం రిటైర్డ్‌ సూపరింటెండింగ్‌ ఇంజ నీర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ఫజల్‌ వెల్లడించారు. కాళే శ్వరం ప్రాజెక్టు నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సైట్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం(క్రాస్‌ సెక్షన్ల) ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించినట్టు తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ శుక్రవారం నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు ఆయన హాజరై వాంగ్మూ లం ఇచ్చారు.

నాటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన సాంకేతిక అనుమతులు, హైపవర్‌ కమిటీ సిఫారసుల ప్రకారం సుందిళ్ల బరాజ్‌ నిర్మాణం విషయంలో నిర్ణయాలు జరిగాయని తెలిపారు. వరంగల్‌ ఎన్‌ఐటీ నిపుణులు అందించిన జియో టెక్నికల్‌ స్టడీస్‌ నివేదిక ఆధారంగా షీట్‌ పైల్స్‌కు బదులుగా సికెంట్‌ పైల్స్‌తో సుందిళ్ల బరాజ్‌ నిర్మించడానికి వీలు కల్పిస్తూ డిజై న్లలో మార్పులు చేశామన్నారు.

బరాజ్‌కు అద నపు గేట్లు పెట్టాలని ఎవరు నిర్ణయం తీసుకు న్నారని కమిషన్‌ ప్రశ్నించగా, 58 గేట్లు, మరో 10 స్లూయిస్ల(పూడిక తొలగింపు గేట్లు)తో బరాజ్‌ నిర్మించడానికి మాత్రమే డ్రాయింగ్స్, డిజైన్లు ఇచ్చామని బదులిచ్చారు. అదనపు గేట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనగానీ, దానికి డిజైన్లు సిద్ధం చేయాలని కోరుతూ ఫైల్‌ గానీ తన వద్దకు రాలేదన్నారు. అదనపు గేట్ల ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. 2డీ మోడల్‌ స్టడీస్‌ ఆధారంగానే సుందిళ్ల బరాజ్‌ డిజైన్లు రూపొందించామన్నారు. తమకు బరాజ్‌ నిర్మాణంతో సంబంధం లేదని చెప్పారు.  


హరిరామ్‌ ఇచ్చిన లేఖను అందజేసిన నరేందర్‌రెడ్డి 
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్‌ పనులకు తానే బాధ్యుడిని అని ధ్రువీకరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నాటి సీఈ హరిరామ్‌(ప్రస్తుతం గజ్వేల్‌ ఈఎన్‌సీ) ఇచ్చిన లేఖను సీడీవో రిటైర్డ్‌ ఈఎన్‌సీ నరేందర్‌రెడ్డి శుక్రవారం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు అందజేశారు. బరాజ్‌ల డిజైన్లు, డ్రాయింగ్స్‌ను కేంద్ర జలసంఘానికి పంపడానికి ముందు చెక్‌ లిస్ట్‌పై సంతకం చేయడానికి తాను నిరాకరించగా, హరిరామ్‌ ఈ మేరకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చారని ఆయన గురువారం కమిషన్‌కు నివేదించిన విషయం తెలిసిందే. శుక్రవారం మళ్లీ కమిషన్‌ ఎదుట ఆయన హాజరై ఈ పత్రాన్ని ఆధారంగా అందజేశారు.

గురువారం జరిగిన విచారణ సందర్భంగా కమిషన్‌కు ఇవ్వలేకపోయిన సమాచారాన్ని శుక్రవారం ఆయన అందజేశారు. రేడియల్‌ గేట్లను ఒకే ప్రయత్నంలో 2 మీటర్లకు మించి పైకి ఎత్తడం సాధ్యం కాదని, వాటిని ఎందుకు డిజైన్లలో ప్రతిపాదించారని కమిషన్‌ ఆయన్ను ప్రశ్నించింది. ఈ వాదన సరైనది కాదని తెలిపే పత్రాలను ఆయన కమిషన్‌కు అందజేశారు. కమిషన్‌ తదుపరి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఈ నెల 27న నిర్వహించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement