పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, రేవంత్‌ అరెస్ట్‌ | T Congress Leaders Protest Against Rahul Gandhi Arest | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత : రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Oct 1 2020 6:38 PM | Updated on Oct 1 2020 8:40 PM

T Congress Leaders Protest Against Rahul Gandhi Arest   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌ హత్యాచార ఘటనకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డగించారు. ఇక అంతకుముందు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌ నేత, ఆ పార్టీ ఎంపీ రేవంత్‌ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ నేత అనిల్‌ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

మరోవైపు కాంగ్రెస్‌ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌ వైపు దూసుకెళ్లారు. రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ ప్రదర్శనలతో గాంధీభవన్‌, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్‌ గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : నిరంతరం ప్రజల్లో ఉండాలి

Advertisement
 
Advertisement
Advertisement