ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు | Survey numbers can now be changed in Telangana | Sakshi
Sakshi News home page

ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు

Jun 1 2025 2:24 AM | Updated on Jun 1 2025 11:35 AM

Survey numbers can now be changed in Telangana

రికార్డుల్లో ఒక సర్వే నంబర్‌.. కబ్జాలో ఉన్న భూమిది మరొకటి

రాష్ట్రంలో చాలా ఏళ్లుగా ఈ సమస్య

రైతుకు ఇష్టమైతే సర్వే నంబర్లు మార్చాలని సర్కారు నిర్ణయం

సరికొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

సర్వే నంబర్‌ మాత్రమే మారుస్తాం.. భూ విస్తీర్ణం మార్చబోము

మంత్రి పొంగులేటి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రికార్డులో ఒక సర్వేనంబర్‌ ఉంటుంది.. భూమి మరో సర్వే నంబర్‌లో ఉంటుంది.. పాసు పుస్తకంలో ఉండే సర్వే నంబర్‌కు, రైతు కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నంబర్‌కు పొంతనే ఉండదు. తెలంగాణలోని చాలా వ్యవసాయ భూముల పరిస్థితి ఇదే. ఇప్పుడీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ వ్యవస్థలో నూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రైతుకు ఇష్టమైతే పాస్‌ పుస్తకంలోని సర్వే నంబర్‌ను మార్చి కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నంబర్‌ను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

పాతదే అయినా.. పట్టించుకోలేదు: దశాబ్దాల తరబడి తెలంగాణలో భూముల సర్వే జరగని కారణంగా సర్వే నంబర్లు తప్పుగా నమోద యినా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఏ సర్వే నంబర్‌ అయితే ఏముందిలే... ఉన్న భూమి రికార్డులో ఉంటే చాలంటూ రైతులు కూడా ఆ సమస్యను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేపడుతోంది. గ్రామ నక్షాలు లేని 413 గ్రామాలను గుర్తించిన ప్రభు త్వం.. 5 గ్రామాల్లో పైలట్‌ పద్ధతిలో భూముల రీసర్వేకు పూనుకుంది. 

ఈ రీసర్వేలో సర్వే నంబర్ల సమస్య వెలుగులోకి వచ్చింది. రీసర్వే జరు గుతున్న సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 32 మండలాల్లో భూభారతి చట్టాన్ని పైలట్‌గా అమలు చేస్తూ రైతుల భూసమ స్యలపై దరఖా స్తులు తీసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల్లోనూ సర్వే నంబర్ల మార్పిడి విజ్ఞాపనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుకు ఇష్టమైతే తన పాసుపుస్తకంలోని సర్వే నంబర్‌ను మార్చాలని నిర్ణయించింది.

అందరికీ తెలిసేలానే మార్పు..
రికార్డుల్లో సర్వే నంబర్ల మార్పు కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారం చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూమి ఓ సర్వే నంబర్‌లో ఉండి రికార్డుల్లో మరో సర్వే నంబర్‌ ఉంటే.. ఆ రెండు సర్వే నంబర్లలోని రైతుల్లో ఎవరైనా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది. అప్పుడు రెండు సర్వే నంబర్లలోని రైతులకు వారం రోజుల నోటీసును రెవెన్యూ యంత్రాంగం ఇస్తుంది. ఆ వారం రోజుల్లో అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తుంది. 

లేదంటే గ్రామసభ పెట్టి అక్కడే రైతుల నుంచి సంతకాలు తీసుకుని వారిద్దరి సర్వే నంబర్లలోని రికార్డులను మార్పు చేసి వాస్తవంగా కబ్జాలో ఉన్న సర్వే నంబర్‌ను పాస్‌బుక్‌లో చేరుస్తారు. ఈ సర్వే నంబర్‌ సమస్య ఒకే రైతుకు ఉంటే ఆ రైతుకు నోటీసు ఇచ్చి ఆ తర్వాత రికార్డు మారుస్తారు. అయితే, ఇక్కడ సర్వే నంబర్‌ను మాత్రమే మారుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి విస్తీర్ణం మార్చబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement