గెజిట్‌పై స్టే ఇవ్వలేం! | Supreme Court on the issue of handing over projects to Krishna and Godavari boards | Sakshi
Sakshi News home page

గెజిట్‌పై స్టే ఇవ్వలేం!

May 8 2025 12:59 AM | Updated on May 8 2025 12:59 AM

Supreme Court on the issue of handing over projects to Krishna and Godavari boards

కృష్ణా, గోదావరి బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై సుప్రీంకోర్టు  

ప్రాజెక్టులు అప్పగించాలని 2021లో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ 

గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేసిన తెలంగాణ  

ఈ పరిస్థితిలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం స్పష్టీకరణ 

తదుపరి విచారణ జూలై 28కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి పరీవాహకంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)కు అప్పగించాలని ఆదేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై ప్రస్తుత పరిస్థితిలో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన డివిజన్‌ బెంచి విచారణ జరిపింది. 

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు గాను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 3 కింద కృష్ణా ట్రిబ్యునల్‌–2కు కేంద్రం అదనపు మార్గదర్శకాలు (టీఓఆర్‌) జారీ చేసిన నేపథ్యంలో అంతకు ముందు జారీ చేసిన గెజిట్‌పై స్టే విధించాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు స్టేను కోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, గెజిట్‌ ఇంకా అమల్లోకి రాలేదని బదులిచ్చారు. ‘అమల్లోకి రానప్పుడు స్టే ఎందుకు? అలాంటి ఉపశమనం ఇవ్వలేము’అని కోర్టు స్పష్టం చేసింది. 

ఈ విషయంలో వాదనలు విని తుది తీర్పు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగలేదని, ఈ పరిస్థితిలో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా బోర్డుకు అప్పగించడం సరికాదని తెలంగాణ న్యాయవాది కోర్టుకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీకి ఓ ప్రాతిపదికన లేనప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం తగదన్నారు. 

కాగా, నీటి పంపకాలను కృష్ణా ట్రిబ్యునల్‌–2 తేల్చలేదని, ఈ పరిస్థితిలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు తుదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరిపేందుకు గాను కృష్ణా ట్రిబ్యునల్‌–2కు అదనపు మార్గదర్శకాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులోని మరో ధర్మాసనం విచారించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement