Statue Of Equality: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

Statue Of Equality Inauguration Ceremony: Heavy Security With 7500 Cops - Sakshi

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్‌ ముచ్చింతల్‌ ఆశ్రమంలో సమతా మూర్తి సమారోహం వేడుకలకు 7500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎనిమిది విభాగాలుగా పోలీసులకు బాధ్యతలు కేటాయించారు. రెండు సెక్టార్లుగా ట్రాఫిక్‌  క్లియరెన్స్‌కు 1200 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.  

సమతామూర్తి ప్రాంగణంలో.. 
సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో నలుగురు ఏసీపీల ఆధ్వర్యంలో బందోబస్తు  ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండు మంది సీఐలు, 58 ఎస్సైలు, 218 మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు 134, ఇతర 20 మంది ఉంటారు. 

యాగశాల వద్ద..  
యాగశాల వద్ద  1682 మంది పోలీసులతో బందోబస్తుకు కేటాయించారు. ఇందులో డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు, 155 మంది ఎస్సైలు, 1214 మంది కానిస్టేబుళ్లు, 240 అదనపు పోలీసులను కేటాయించారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు)

ప్రవచన మండపం వద్ద..  
ప్రవచన మండపం వద్ద 157 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఓ డీసీపీ అధికారితో పాటు ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 28 మంది ఎస్సైలు, 88 కానిస్టేబుళ్లు, 36 మంది ప్రత్యేక పోలీసులు ఉంటారు.

భోజన శాల వద్ద..  
భోజన శాల వద్ద ఓ డీసీపీ స్థాయి అధికారితోపాటు నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 8మంది ఇన్‌స్పెక్టర్లు, 24 మంది ఎస్సైలు, 124 మంది కానిస్టేబుళ్లు, 120 ప్రత్యేక పోలీసులను కేటాయించారు. 

రూట్‌ల వారిగా.. 
ఆశ్రయానికి వచ్చిపోయే రహదారులను 17 రూట్‌లుగా విభజించారు. ఆయా రూట్‌లలో 1200 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు.   

ట్రాఫిక్‌ పర్యవేక్షణ ఇలా.. 
వీవీఐపీలు, వీఐపీలు, కీలక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోదీ తదితరులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సెక్టార్ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సహస్రాబ్ది ఉత్సవాలకు మాధవ సేవకులు 
రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో సేవలందించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో సేవకులు తరలివచ్చారు. శ్రీరామనగరంలో బుధవారం నుంచి ఈ నెల 14 వరకు జరుగనున్న ఉత్సవాల్లో సేవలు అందించేందుకు సుమారు 8 వేల మంది సేవకులు తరలివచ్చారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో సేవకులకు బాధ్యతలు అప్పగించారు. యాగశాల, భోజనశాల, రవాణా, పూజా, వైద్య, తదితర 18 రకాల సేవా విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు.  

రుత్వికుల సందడి.. 
ఇక్కడ యాగ శాలలో నిర్వహించే హోమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు ఇక్కడికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌ పూర్తి అయిన తర్వాత హోమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: అసమానత వైరస్‌.. సమతే వ్యాక్సిన్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top