
తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ (TSCS) ఆధ్వర్యంలో నిర్వహణ
ఖమ్మం, : ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా, తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ (TSCS) ఖమ్మంలో అవగాహన మరియు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 15 మంది పిల్లలకు వారి ధైర్యం మరియు విజయాలకు గుర్తింపుగా ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. అలాగే, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల సమన్వయకర్తలందరినీ వారి అంకితభావ సేవలను గుర్తించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రఘురామ రెడ్డి మాట్లాడుతూ... "తలసేమియా బాధితులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ వ్యాధిపై అవగాహన పెంచడం మరియు నిర్మూలన కోసం మేము కృషి చేస్తాము. ఈ సమస్యను పార్లమెంటులో కూడా లేవనెత్తుతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వద్ద ఈ సమస్యను తప్పకుండా చర్చిస్తాం" అని ఎంపీ తలసేమియా బాధితులకు మద్దతును తెలియజేశారు.
టీఎస్ సీఎస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రత్నవలి కొట్టపల్లి ఆధ్వర్యంలో, TSCS సిబ్బంది ప్రత్యేక సన్మానాలు చేశారు. దీంతో పాటు తలసేమియాతో బాధ పడుతున్న పిల్లలతో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటలు మరియు ఆసక్తికరమైన కార్యక్రమాలను నిర్వహించారు. ఇవి తలసేమియా బాధిత కుటుంబాలకు సంతోషాన్ని నింపాయి.
ఈ కార్యక్రమం గురించి శ్రీమతి రత్నవలి మాట్లాడుతూ... "TSCS తరపున నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తులు, సంస్థలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఖమ్మం మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిబద్ధతకు TSCS హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తోంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయం చేసి, నిర్వహించిన డాక్టర్ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ మరియు శ్రీ శివరతన్ గార్లు చురుగ్గా పాల్గొన్నారు. వారి సహకారానికి TSCS తరఫున ధన్యవాదాలు." అని పేర్కొన్నారు.