
శకుంతలా బాయి- ఇంటిని సీజ్ చేయిస్తున్న తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మచ్చలా నిలుస్తోంది. చివరికి తమను కని, పెంచి, ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తుంది. అయితే వృద్ధాప్యంలోనూ తనను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు ఓ తల్లి తగిన బుద్ధి చెప్పింది. జిల్లా రెవెన్యూ అధికారుల సహాయంతో ఎట్టకేలకు తన సొంతింటిని తాను సొంతం చేసుకుంది.
మూసారాంబాగ్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన శకుంతులా బాయి (90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన నివాసంలో కొడుకులతో కలిసి ఉండేది. కొంత కాలం తర్వాత తల్లి ఆలనా పాలన చూడాల్సిన కుమారులు నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తల్లిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపేశారు. దాంతో గత్యంతరం లేక వృద్ధురాలు ఏడాదిన్నరగా సైదాబాద్లోని చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటుంది.
తన బాగోగులు చూడని కొడుకులు తన ఇంట్లో ఉండ కూడదని నిర్ణయించుకుంది. సీనియర్ సిటిజెన్స్ అసోషియేషన్ ప్రతినిధులతో కలిసి వెళ్లి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను 2024 ఫిబ్రవరిలో తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. ఆర్డీఓ ఆమె ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంటిని తల్లికి ఇవ్వడానికి మొదట ఇద్దరూ అంగీకరించారు. అయితే నెలలు గడుస్తున్నా వారు ఇంటిని ఖాళీ చేయడం లేదు.
ఆర్డీఓ ఆదేశాల మేరకు సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించ లేదు. దాంతో తహసీల్దార్ మూడు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేయాలని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఫైనల్ నోటీసులు ఇచ్చారు. దాంతో వారు ఇంటికి తాళం వేసి సమాచారం ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయారు. గురువారం సైదాబాద్ తహసీల్దార్ సిబ్బందితో వచ్చి ఇంటిని సీజ్ చేసారు. శకుంతలా బాయికి ఇల్లు అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు.