దాటవేత ధోరణిలో సమాధానం | SIT interrogates former SIB chief Prabhakar Rao for the second time | Sakshi
Sakshi News home page

దాటవేత ధోరణిలో సమాధానం

Jun 12 2025 3:45 AM | Updated on Jun 12 2025 3:45 AM

SIT interrogates former SIB chief Prabhakar Rao for the second time

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును రెండోసారి విచారించిన సిట్‌  

ప్రణీత్‌రావుతో కలిపి ప్రశ్నలు అడిగిన అధికారులు.. ఎస్‌ఐబీలో అనేక ఆపరేషన్లు జరుగుతాయన్న మాజీ చీఫ్‌ 

14న మళ్లీ విచారణకు రావాలని నోటీసు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈయన్ను సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ రెండో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్, సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. 

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు విచారణకు పిలిచారు. ఇద్దరినీ కలిపి కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం తొలిసారిగా విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు ఏం సంబంధం అని, దానికి అనుమతి ఇవ్వడానికి సాధికారిక కమిటీ ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 

అయితే అప్పట్లో ఆయా ఫోన్లు ట్యాప్‌ చేయడానికి సహకరించాల్సిందిగా టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లకు ఎస్‌ఐబీ నుంచి వెళ్లిన లేఖల్ని సిట్‌ బుధవారం తీసుకొచ్చింది.వీటిపై డిజిగ్నేటెడ్‌ అధికారిగా ప్రభాకర్‌రావు పేరు, ఆయన సంతకం ఉండటాన్ని సిట్‌ ప్రస్తావించింది. ట్యాపింగ్‌తో సంబంధం లేనప్పుడు ఆయా లేఖలపై ఎందుకు సంతకం చేశారంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు, వ్యాపారులతోపాటు నేతలు, వారి కుటుంబీకుల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారని, వారి నంబర్లను ట్యాప్‌ చేస్తున్నారని తెలిసినప్పుడు లేఖలపై సంతకాలు ఎందుకు చేశారని అధికారులు  ప్రశ్నించారు.

కొందరు జడ్జిలకు సంబంధించిన కాల్‌ డిటేల్స్‌ సేకరించడం వెనుక ఉన్న కారణాలపై ఆరా తీశారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్న లకు ప్రభాకర్‌రావు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రణీత్‌రావుతో కలిపి ప్రభాకర్‌రావును విచారించిన సిట్‌ గతంలో సేకరించిన ఆధారాలు, తదితరాలను వీరి ముందు ఉంచారు.

హార్డ్‌డిస్క్‌ శకలాల్ని మూసీలో ఎందుకు వేశారు 
ఇద్దరినీ వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు... కలిపి అవే అడిగి, వారు చెప్పిన సమాధానాలతో సరిచూశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసమే ఎస్‌ఐబీలో స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) ఏర్పాటు చేశానని చెప్పిన ప్రభాకర్‌రావు సమర్థత ఆధారంగానే ఆ బాధ్యతలు ప్రణీత్‌కు అప్పగించినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిట్‌ అధికారులు అలాంటప్పుడు ఎస్‌ఓటీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 

మావోయిస్టుల కోసం తాము చేసే కొన్ని అత్యంత రహస్య ఆపరేషన్ల కోసమే అలా ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్‌రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కితే జాతీయ భద్రతతోపాటు కొందరు అధికారులకు ముప్పు అని, ఆ కారణంగానే ఆయా ఆపరేషన్ల సమాచారం ఉన్న హార్డ్‌డిస్‌్కలు పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేస్తుంటామని ప్రభాకర్‌రావు సిట్‌ అధికారులకు తెలిపారు. 

అలా ధ్వంసం చేయడం సర్వసాధారణమే అయితే వాటి శకలాలను తీసుకెళ్లి నాగోలు వద్ద మూసీనదిలో పారేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులను సిట్‌ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభాకర్‌రావు నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్‌ చేశారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు నోటీసులు జారీ చేశారు. 

ఆ రోజు ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై ఉన్న మరో నిందితుడితో కలిపి విచారించనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ప్రభాకర్‌రావు నుంచి సరైన సహకారం లభించట్లేదని, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానాలు చెప్పట్లేదని సిట్‌ చెబుతోంది. తనను ట్యాపింగ్, సీడీఆర్‌ల విశ్లేషణకు సంబంధించిన ఆదేశాలు ప్రభాకర్‌రావు నుంచి వచ్చాయని ప్రణీత్‌రావు చెబుతుండగా... ప్రభాకర్‌రావు మాత్రం వీటిని ఖండిస్తున్నారని వివరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement