
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత విచారణలో అధికారుల ప్రశ్నలకు ఆయన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు బృందం ఆదేశించిన సంగతి తెలిసిందే.
మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణకు ప్రభాకర్ రావు(Prabhakar Rao) రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమయంలో వాడిన సెల్ఫోన్లు(రెండు), ల్యాప్ ట్యాప్, మ్యాక్ బుక్లను తీసుకురావాలని ఆయన్ని అధికారులు ఆదేశించారు. వీటి ద్వారా ఈ కేసులో కీలక సమాచారం రాబట్ట వచ్చని సిట్ భావిస్తోంది. దీంతో ఆయన వాటిని తీసుకొస్తారా? అధికారులకు అందిస్తారా? ఏదైనా కారణం చెబుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారంలోకి వెలుగులోకి వచ్చాక.. ఆయన అమెరికా వెళ్లారు. సుమారు 15 నెలల తర్వాత సుప్రీం కోర్టులో అరెస్ట్ నుంచి ఊరట లభించడం, పైగా విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ నెల 8వ తేదీ హైదరాబాద్కు వచ్చారు. ఆపై ఆ మరుసటిరోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మొదటిసారి 8గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్.. ఫోన్ ట్యాఇపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్నింటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ, ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావు ఎస్ఐబీకి చెందిన హార్డ్డిస్క్ల డాటా మాయం చేశాడని విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు.
ఎస్ఐబీలో పాత హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్తవి పెట్టడం.. కొన్ని దశాబ్దాలుగా నిఘా వర్గాలు దాచిన ఉగ్రవాద, తీవ్ర వాద సమాచారం మాయం కావడంపైనా ప్రభాకర్ రావును ఆరా తీశారు. అయితే వీటిలో దేనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు రెండో రౌండ్ విచారణపై రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.