ఈ నెలాఖరుకు సువర్ణ ఉద్యోగ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అటవీశాఖ కొత్త ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్ నియమితులయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. దీంతో కొత్త పీసీసీఎఫ్ నియామకానికి సంబంధించి వినయ్కుమార్, వీపీ జౌహరీ, సునీతా భగవత్ల పేర్లతో కూడిన ప్యానెల్ను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్టు సమా చారం. వీరిలో వినయ్ కుమార్ సీనియర్, 1992 బ్యాచ్కు చెందిన అధికారి కావడంతో ఆయనకే ఈ పోస్ట్ దక్కే సూచనలున్నట్టు తెలుస్తోంది.
అయితే మిగతా ఇద్దరు అధికారులు సైతం పీసీసీఎఫ్ అయ్యేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.గత ఫిబ్రవరిలోనే వినయ్కుమార్ను పీసీసీఎఫ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్గా నియమించారు. మూడు దశాబ్దాలకు పైగా అటవీ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లోని వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఆదిలాబాద్ డీపీఏపీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా పనిచేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కమిషనర్ – ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్గా బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణలో అమ్రాబా ద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్గా వరల్డ్ బ్యాంక్, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. నీటి వనరుల సుస్థిర నిర్వహణలో చేసిన కృషికి గాను 2014లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్ ఫర్ లైఫ్’ అవార్డులో ఫస్ట్ రన్నర్–అప్గా గౌరవం పొందారు.


