టీఎస్‌పీఎస్సీలో ఒకే ఒక్కడు!

Krishna Reddy Appointed TSPSC Acting Chairman - Sakshi

ఇన్‌చార్జి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిలు 

 చైర్మన్‌ సహా దాదాపు సభ్యులందరూ పదవీ విరమణ 

కొంతకాలం ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించిన కృష్ణారెడ్డి 

తాజాగా ముగిసిన ఆయన పదవీ కాలం.. పదవీ విరమణ 

చైర్మన్, ముగ్గురు సభ్యులు లేనిదే కొత్త నోటిఫికేషన్లకు నో చాన్స్‌ 

హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో కీలక భూమిక పోషించే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో కోరం కరువైంది. కొత్తగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అవసరమైన సంఖ్యలో సభ్యులు లేకుండా వెలవెలబోతోంది. గత నెల వరకు చైర్మన్, ఒక సభ్యుడితో ఉన్న కోరం.. ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్మన్‌కు పరిమితమైంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో సభ్యులెవరూ లేరు. తెలంగాణ వచ్చాక ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీకి తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. సభ్యులుగా సి.విఠల్, చంద్రావతి, కృష్ణారెడ్డి, సాయిలును ప్రభుత్వం నియమించింది. గతేడాది డిసెంబర్‌లో ఘంటా చక్రపాణి, చంద్రావతి, సి.విఠల్‌ పదవీ కాలం పూర్తయింది. దీంతో ఇద్దరు సభ్యులు మాత్రమే మిగలడంతో సీనియర్‌ సభ్యుడైన కృష్ణారెడ్డిని ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. మార్చి 18తో కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తయింది. దీంతో ఖాళీగా ఉన్న చైర్మన్‌ స్థానంలో సభ్యుడు సాయిలును ప్రభుత్వం ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించడంతో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

కోరం లేకుంటే.. 
రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడాలంటే కమిషన్‌లో కోరం తప్పనిసరి. చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటేనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో ఒకే ఒక్కరు మిగలడంతో నోటిఫికేషన్లు వెలువడంపై అయోమయం నెలకొంది. టీఎస్‌పీఎస్సీని గత 3 నెలలుగా ఇన్‌చార్జి చైర్మన్‌తోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి కమిషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం వెలువడట్లేదు. కాగా, ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీలకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. వీటికి ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా.. 50 వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తే శాఖల వారీగా ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చాక నోటిఫికేషన్లు టీఎస్‌పీఎస్సీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ నోటిఫికేషన్ల విడుదలకు టీఎస్‌పీఎస్సీలో కోరం లేదు. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్షేత్ర స్థాయిలో సందిగ్ధం వీడట్లేదు. టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా.. అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాల్లో చేరగా.. మిగతా ప్రక్రియ కొనసాగుతోందని కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top