కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు! | Sanjay Jaju as New Chief Secretary of Telangana | Sakshi
Sakshi News home page

కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు!

Jun 24 2026 5:43 AM | Updated on Jun 24 2026 5:43 AM

Sanjay Jaju as New Chief Secretary of Telangana

దాదాపు 12 ఏళ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రాష్ట్రానికి రాక 

రాష్ట్ర కేడర్‌కు పంపాలన్న ప్రభుత్వ వినతిని ఆమోదించిన కేంద్రం 

దీంతో ఆయన సీఎస్‌గా నియమితులు కానున్నట్లు పేర్కొన్న ఉన్నతస్థాయి వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌ జాజు తెలంగాణకు తిరిగి రానున్నారు. ఆయనను తెలంగాణ కేడర్‌కు పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో సంజయ్‌ జాజు సీఎస్‌గా నియమితులు కానున్నారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి, ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సీఎస్‌ పదవి కోసం మొన్నటి వరకు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌లు అయిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌ రంజన్‌ (పురపాలక శాఖ), వికాస్‌రాజ్‌ (ఆర్‌అండ్‌బీ) పోటీపడ్డారు. వారిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. 

అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా సంజయ్‌ జాజును తెలంగాణ కేడర్‌కు తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంత కేడర్‌ అయిన తెలంగాణకు వస్తున్నారు. సంజయ్‌ జాజును కేడర్‌కు పిలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపిందనే చర్చ మొదలైంది. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంజయ్‌ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన అక్టోబర్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్‌గా సంజయ్‌ జాజు రాకను ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు సైతం ధ్రువీకరించాయి. 



   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement