ఖమ్మంజిల్లాలోనేటి రైతు ఆశీర్వాద సభ వాయిదా
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద మంగళవారం తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని, ఇదే సభను వచ్చే నెలలో రైతుభరోసా నిధుల పంపిణీ అనంతరం ముగింపు సభగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సభా ప్రాంగణం బురదమయంగా మారడంతో, రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ ప్రాంతాన్ని సోమవారం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించాలని భావించినా వాతావరణ పరిస్థితులతో వాయిదా వేశామని తెలిపారు. తొలిరోజు ప్రారంభ సభగా అనుకున్నా, రైతు భరోసా పంపిణీ పూర్తయ్యాక ఈ సభను మరింత ఉత్సాహంతో ముగింపు వేడుకగా నిర్వహిస్తామని భట్టి స్పష్టం చేశారు. వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి జూలై 6, 7 లేదా 8వ తేదీల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


