అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం | Developments Progress Report Released On The Occasion Of State Formation Celebrations In Congress Government, More Details | Sakshi
Sakshi News home page

అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం

Jun 1 2025 2:34 AM | Updated on Jun 1 2025 5:58 PM

Progress report released on the occasion of state formation celebrations

అధికారం చేపట్టినప్పటి నుంచి అమలు చేస్తున్న కార్యక్రమాలనువివరించిన ప్రభుత్వం 

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రగతి నివేదిక విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కూడిన ప్రగతి నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. 

పథకాలు.. కార్యక్రమాలు.. 
ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టి ప్రజలందరికీ ప్రవేశం కల్పించినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మచ్నూర్‌ కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించే వరకు చేపట్టిన కార్యక్రమాలను ప్రగతి నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది. ప్రజావాణి, ప్రజాపాలన, హైదరాబాద్‌ రైజింగ్, మహాలక్ష్మి పథకం అమలు, చేయూత, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రూ. 500కే వంట గ్యాస్‌ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం, రాజీవ్‌ యువవికాసం, పంట రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు, ఉచిత విద్యుత్, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీమయ భరోసా, రైతు నేస్తం, రైతు సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు, సన్నబియ్యం తదితర పథకాల అమలును నివేదికలో వివరించింది. 

వివిధ శాఖల్లో అమలు చేసిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత ప్రభుత్వ అప్పులకు చేసిన చెల్లింపులను అందులో పేర్కొంది. అలాగే తెలంగాణ వేదికగా బయో ఆసియా, ఏఐ గ్లోబల్‌ సమ్మిట్, లీడర్‌షిప్‌ సమ్మిట్, కామన్వెల్త్‌ మీడియేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు, సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు, ఆటోమోటివ్స్‌ ఫెస్టివల్, సైబర్‌ సెక్యూరిటీ కాంక్లేవ్, భారత్‌ సమ్మిట్‌ మొదలైనవి జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

అభివృద్ధి ప్రణాళికలు కూడా.. 
సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే–2024 కోసం చేపట్టిన చర్యలను నివేదికలో ప్రభుత్వం వివరించింది. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తీరును వివరించడంతోపాటు ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలను వెల్లడించింది. మెట్రో విస్తరణ, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు, హైడ్రా ఆవిర్భావం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల గురించి తెలియజేసింది. 

కొత్త ఉద్యోగ నియామకాలను శాఖలవారీగా వెల్లడించింది. భూభారతితోపాటు స్పీడ్‌ పథకం కింద చేపట్టిన 19 ప్రాజెక్టులు, మూసీ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాల అమలు గురించి వివరించింది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ. 1,266 కోట్ల సాయం 
ప్రగతి నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా అందించిన సాయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఎంఆర్‌ఎఫ్‌ కార్యక్రమంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని.. ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2.87 లక్షల మందికి ఈ నిధి ద్వారా రూ. 1,266 కోట్ల సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement