స్వావలంబనతో సమాజాభివృద్ధికి తోడ్పడండి

President Draupadi Murmu Visit Bhadradri Temple - Sakshi

విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్బోధ

ఏకలవ్య పాఠశాలలతో మెరుగైన విద్య అందుతుందని వెల్లడి

సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనానికి హాజరు

భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువుతో స్వావలంబన సాధించి సమాజ పురోగతికి దోహద పడాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేటి విద్యార్థులే భావి భారత పౌరులని, దేశ భవి ష్యత్‌ విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పా రు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు గిరిజన, మారు మూల ప్రాంతాల విద్యార్థుల అవసరాలను తీరు స్తూ మెరుగైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రపతి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సారపాకలోని ఐటీసీకి చేరు కున్న ముర్ము.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌ (ప్రసాద్‌) పథకం ద్వారా రూ.41 కోట్లతో చేపట్టబోతున్న పనులకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ ఆదివాసీ కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అదే వేదిక నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో కొత్తగా నిర్మించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు.

‘ప్రసాద్‌’తో సౌకర్యాలు మెరుగు
ప్రసాద్‌ పథకం ద్వారా దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగవుతుండగా దేశ, విదేశీ యాత్రికులు తీర్థ యాత్రలకు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ముర్ము చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర పర్యాటక శాఖకు సూచించారు. 

పారేడు గొట్టు గోత్రం..
ఉదయం 10:53కు రాష్ట్రపతి సారపాక చేరుకు న్నారు. గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర మంత్రులు సత్య వతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వా య్‌లో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు గోత్రనా మాలు అడగగా ‘నా పేరు ద్రౌపదీ ముర్ము,  గోత్ర నామం పారేడు గొట్టు’ అని తెలిపారు.

అంతకుముందు రాష్ట్రపతికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛర ణలతో ఆలయ అర్చకులు, అధికారులు స్వాగ తం పలికారు. రాష్ట్రపతి ముందుగా ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకోగా పండితులు వేదాశీర్వ చనం అందజేశారు. ఐటీసీలో భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో ములుగు జిల్లా రామప్పకు వెళ్లారు.

తెలుగు పూర్తిగా నేర్చుకుంటా..
సమ్మేళనంలో ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చిన రాష్ట్రపతి.. ‘అందరికీ నమస్కా రం’ అంటూ తెలుగులో అభివాదం చేశారు. ప్రముఖ కవి దాశరథి రాసిన ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అనే కవితా పంక్తులను ప్రస్తావించారు. ‘నేను మాట్లాడుతున్న తెలుగు మీకు కొంచెం కొంచెమే అర్థం అవుతోందని నాకు తెలుస్తోంది’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు.

త్వరలోనే తెలుగు పూర్తిగా నేర్చు కుంటానని చెప్పారు. తెలంగాణలో మొదటి సారి చేస్తున్న పర్యటనలోనే ఆలయాలను సందర్శించే అవకాశం రావడంతో. అక్కడ దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించే భాగ్యం తనకు దక్కిందని రాష్ట్రపతి చెప్పారు. తెలంగాణ ప్రజలకు అంతా మంచే జరగాలని కోరుకుంటానన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top