
హన్మకొండ, సాక్షి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి మాట్లాడితే.. ఆ షాక్ ఎలా ఉంటుందో ఉహించుకోండి. అలాంటి ఘటనే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. కుంటలో ఓ మృతదేహం తేలియాడుతున్నదన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ వ్యక్తిని బయటికి లాగుతుండగా సదరు వ్యక్తి లేచి మాట్లాడడం చూసి షాక్కు గురయ్యారు.
శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ కాజీపేటలోని ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు సోమవారం చిత్తుగా మద్యం సేవించి నగరంలోని రెడ్డిపురంలోని కోవెలెకుంటకు వెళ్లారు. అక్కడ కొంతసేపు కుంటలోకి దిగారు. మద్యం మత్తులో శ్రీనివాస్ కొంత ఒడ్డు మేరలో నిద్ర పోయాడు. శ్రీనివాస్ మృతి చెందినట్లుగా భావించిన వారు అక్కడినుంచి జారుకున్నారు. ఆ తర్వాత స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు గమనించి 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అంబులెన్స్తోపాటు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంట లోతుగా ఉన్నట్లు భావించిన పోలీసులు ఒకరిచేయి మరొకరు పట్టుకుని తేలియాడుతున్న ఆ వ్యక్తిని బయటికి లాగేందుకుప్రయత్నిస్తున్న క్రమంలో అతనే నేరుగా లేచి నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. బయటికి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుంటలో చల్లదనానికి నిద్ర వచ్చనట్లు సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడు. తనకు రూ.50 ఇస్తే కాజీపేటకు వెళ్తానని చెప్పడంతో పోలీసులు అతనికి డబ్బులు ఇచ్చి పంపించి వేశారు.
తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. తీరా వచ్చి చూస్తే షాక్
హనుమకొండ - రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం… pic.twitter.com/zzR7SGbFwP— Telugu Scribe (@TeluguScribe) June 10, 2024
VIDEO CREDITS: Telugu Scribe