
మైనర్ డ్రైవింగ్ విషయంలో పోలీసులు సీరియస్
ఉల్లంఘనులు సైతం జువెనైల్ బోర్డులో హాజరు
భారీగా జరిమానాలు విధిస్తున్న న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మైనర్ డ్రైవింగ్ నిరోధంపై దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ఉల్లంఘనకు పాల్పడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు (వాహన యజమానులైతే)/వాహన యజమానిపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లను జువెనైల్ బోర్డు ఎదుట హాజరుపరుస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సాధారణ కోర్టుకు తరలిస్తున్నారు. దీనికి ముందు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో (టీటీఐ) వీరికి పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు హైదరాబాద్ నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ‘సాక్షి’కి తెలిపారు.
మైనర్ డ్రైవింగ్పై ట్రాఫిక్ విభాగం అధికారులు గత నెల 5 నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. శనివారం వరకు నిర్వహించిన తనిఖీల్లో 2,067 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కారని, వీరిపై కేసులు నమోదు చేశామని జోయల్ డెవిస్ పేర్కొన్నారు. వాహనాలను స్వా«దీనం చేసుకుంటున్న పోలీసులు మైనర్తో పాటు తల్లిదండ్రులు/వాహన యజమానిని టీటీఐకి రప్పిస్తున్నారు. అక్కడ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అభియోగపత్రాలు సిద్ధం చేసి మైనర్ను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు.
న్యాయమూర్తులు మైనర్లకు సామాజిక సేవ వంటి శిక్షలు విధిస్తుండగా... తల్లిదండ్రులు/వాహన యజమానులకు భారీ జరిమానాలు వేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వీరికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాహనంతో పాటు ఆ మైనర్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీఏ అధికారులు పంపిస్తున్నారు. వీటి ఆధారంగా ఆ విభాగం వాహనం రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు రద్దు చేస్తోంది.
సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెరి్నంగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు. అయితే ఇలా డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్కు మాత్రం 25 ఏళ్లు నిండేవరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్ డెవిస్ కోరుతున్నారు.