భూముల విలువలు పెంచిన తర్వాతా ఎప్పటిలాగానే లావాదేవీలు
రోజుకు 2,600కు పైగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు
10 రోజుల్లో 15 వేలకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల నివేదిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎప్ప టిలాగానే జరుగుతున్నాయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. వాస్తవంగా కూడా భూ ముల విలువల సవరణకు ముందు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే పెద్దగా మార్పు ఏమీ లేదని అర్థమవుతోంది. సవరణకు ముందు రోజుకు సగటున ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగేవో, సవరణ తర్వాత కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భూముల విలువలు సవరించిన తర్వాతి పరిస్థితులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. విలువల సవరణ జరిగి పదిరోజులు పూర్తవుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఆరా తీసింది.
ఈ మేరకు నాలుగైదు రోజుల క్రితమే జిల్లా రిజిస్ట్రార్లకు సచివాలయం నుంచి సమాచారం వెళ్లింది. విలువల సవరణ అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్న దానిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా వివరాలు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. ఈ నేపథ్యంలో విలువల సవరణ అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్య కలాపాలు గాడిలో పడ్డాయని, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించామని అధికారులు తెలిపారు.
తగ్గేదే లేదు..!
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం జూన్ నెలలో ఇప్పటివరకు 50 వేల లావాదేవీలు జరిగాయి. అయితే ఇందులో దాదాపు 24 వేల వరకు తొలి 4 రోజుల్లోనే జరిగాయి. భూముల విలువలు పెరుగుతాయన్న కారణంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపడంతో ఆ నాలుగు రోజులు భారీగా లావాదేవీలు జరిగాయి. భూముల విలువలు సవరించిన 10 రోజుల కాలంలో మరో 26 వేల లావాదేవీలు జరగడం గమనార్హం. సెలవు రోజులను మినహాయిస్తే రోజుకు సగటున 2,700 వరకు లావాదేవీలు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ సంఖ్య గతంలో ప్రతిరోజూ జరిగే సగటు లావాదేవీలతో సమానంగా ఉందని, ఈ నేపథ్యంలో కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో పెద్దగా మార్పులేదని అర్థమవుతోంది. వ్యవసాయ భూముల విషయానికి వస్తే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 18 వేల లావాదేవీలు జరిగాయి. అయితే మే నెలలో తొలి పదిరోజుల్లో కేవలం 13,500 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం.


