
బాకీ వసూలుకోసం వచ్చి.. భార్య చేయి పట్టుకున్నారని..
చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై అంజయ్య కథనం ప్రకారం..
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసు రాజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి దేవయ్య, దండుగుల నరేశ్ వద్ద ఏడేళ్ల క్రితం రెండు తులాల బంగారాన్ని అప్పుగా తెచ్చుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. కొన్నాళ్లకు రెండు తులాల బంగారం తిరిగిచ్చాడు. ఒప్పందం ప్రకారం మరో తులం బంగారం బాకీ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రాజు గల్ఫ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అప్పటినుంచి దేవయ్య, నరేశ్ బంగారం కోసం రాజును వేధిస్తున్నారు. మంగళవారం కూడా వచ్చి తులం బంగారం అడిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ‘నీ భార్యను తీసుకెళ్తేనే బంగారం ఇస్తావు..’అంటూ దేవయ్య, నరేశ్.. రాజు భార్య చేయి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన అతడు అక్కడే ఉన్న పురుగుల మందు తాగాడు. రాజు భార్య ఫిర్యా దు మేరకు దేవయ్య, నరేశ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య వివరించారు.