సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె.
ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం.
‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు.
‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె.
కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది.


