ఆగస్టు 15కు ఖైదీల విడుదల లేనట్లే!
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నెలాఖరుకు గానీ, వచ్చే నెల మొదటివారంలోగానీ జాబితా సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించింది. ఆమేరకు జాబితా రూపొందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అయితే ఈ జాబితా ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. ఇందులో న్యాయపరంగా అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అందుకే, ఈ జాబితా రూపకల్పనలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి జాబితా రూపొందిస్తున్నారు. జాబితాలో తీవ్ర, హీనమైన నేరాలు, రిపీటెడ్ అఫెండర్స్ను అసలు పరిగణనలోకి తీసుకోవడంలేదు. అలాగే చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డవారిని కూడా దూరంపెట్టారు. వందశాతం పూర్తి అర్హత కలిగిన ఖైదీలనే ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.