ప్రమాదంలో 26 మెడికల్‌ కాలేజీల మనుగడ | NMC unhappy with management of Telangana govt medical colleges | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో 26 మెడికల్‌ కాలేజీల మనుగడ

Jun 15 2025 1:47 AM | Updated on Jun 15 2025 1:47 AM

NMC unhappy with management of Telangana govt medical colleges

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై ఎన్‌ఎంసీ అసంతృప్తి  

నిబంధనలకు విరుద్ధంగా 26 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు 

18న ఢిల్లీలో వ్యక్తిగత విచారణకు రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈకి పిలుపు 

విచారణలో ఎన్‌ఎంసీ సంతృప్తి చెందకపోతే 2,700 సీట్లపై ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల పనితీరుపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2025–26)లో ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. వచ్చే విద్యా సంవత్సరానికి దాదాపు 2,700 మెడికల్‌ సీట్లు కొనసాగించడమా, రద్దు చేయడమా అనే విషయంలో కమిషన్‌ తేల్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులను వ్యక్తిగత విచారణకు పిలిచింది.

ఈ నెల 18న ఢిల్లీలో వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు (యూజీఎంఈబీ) డైరెక్టర్‌ సుక్లా మీనా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్‌లు వర్చువల్‌గా విచారణకు హాజరు కావాలని సూచించారు.  

కొత్త కాలేజీల్లో అన్నీ సమస్యలే... 
వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీచేసే ముందు ప్రతి సంవత్సరం ఎన్‌ఎంసీ ఆయా కళాశాలలను తనిఖీ చేస్తుంది. యూజీఎంఎస్‌ఆర్‌–2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్‌ బేస్డ్‌ బయోమెట్రిక్‌ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్‌కు కావలసిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్‌ రికార్డింగ్, సీసీటీవీ వంటివి ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. ఈసారి కూడా రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసినప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన 26 కళాశాలల్లో ఎన్‌ఎంసీ పారా మీటర్లకు అనుగుణంగా వసతులు లేవని తేలింది.

కాకతీయ మెడికల్‌ కళాశాలలో కూడా నిబంధనల మేరకు వసతులు లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లోపాలపై ఎన్‌ఎంసీ గతంలో షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా, కాలేజీలు సమాధానాలు సంతప్తికరంగా లేవని పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్‌ ట్రైనింగ్‌ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలను కొనసాగించడమో.. రద్దు చేయడమో నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. 

ఎన్‌ఎంసీ నిబంధనలు పాటించని 26 కళాశాలలు ఇవే.. 
ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్‌ (కాకతీయ మెడికల్‌ కాలేజీ), భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, జనగాం, జయశంకర్‌ భూపాల³ల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, పెద్దపల్లి, వికారాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు నిబంధనల మేరకు లేవని ఎన్‌ఎంసీ తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement