
ప్రస్తుతం ఏడు జోన్లకు గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు
రెండేళ్ల సీనియార్టీ, రిప్లికా నంబర్లున్నది ఈ ఏడుగురికే
వారికే మళ్లీ టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపణలు
టెండర్ సమయం కుదించడంపైనా అనుమానాలు
అంగన్వాడీల్లో కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కొత్త నిబంధనలు.. అగ్మార్క్ సర్టీఫికెట్కు రెండేళ్ల సీనియార్టీ, రిప్లికా నంబర్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాకు నిర్దేశించిన టెండర్ ప్రక్రియ పౌల్ట్రీ రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. టెండర్ నిబంధనలు ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు.. అది కూడా గతంలో టెండర్ దక్కించుకున్నవారికే అనుకూలంగా ఉన్నాయని ఇతర పౌల్ట్రీ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోరుకున్నవారికి టెండర్ కట్టబెట్టేందుకే నిబంధనలు మార్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు టెండర్ ప్రక్రియకు తక్కువ గడువు ఇవ్వటంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏటా 36 కోట్ల గుడ్లు సరఫరా
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద ప్రతీరోజు ఒకటి చొప్పున కోడిగుడ్లు అందిస్తారు. వీటిని ఏడాదిపాటు సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు గత నెలలో టెండర్లు పిలిచింది. మార్చి 30న టెండర్ ఫారాల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 10వ తేదీతో టెండర్ దాఖలు గడువు ముగియనుంది. ఈ క్రమంలో టెండర్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్న పౌల్ట్రీ రైతులు నిబంధనలను చూసి షాకయ్యారు.
టెండర్ నిబంధనలన్నీ కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే అనుకూలంగా ఉండడం.. చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులకు సరిపోలే పరిస్థితి లేకపోవటంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 10,34,562 మంది, 3 సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి ఏటా 36,96,80,897 కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్లు పిలిచింది.
పంపిణీ విధానంలో మార్పులు
కోడిగుడ్ల సరఫరాకు గతంలో జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ద్వారా కాంట్రాక్టర్ల ఎంపిక జరిగేది. రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని మార్చి, కొత్తగా ఏర్పాటైన జోన్ పరిధిని ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ విధానంలో ఏడు జోన్లకు ఏడుగురు కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఏడుగురు కాంట్రాక్టర్లు గుడ్లు సరఫరా చేస్తున్నారు. గత మార్చితో వారి పంపిణీ గడువు పూర్తయింది. కానీ, కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తికాకపోవడంతో నెలరోజులపాటు వారి కాంట్రాక్టును పొడిగించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారు.
నిబంధనలు... మార్చారిలా..
⇒ కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు విషయంలో 12 రకాల నిబంధనలున్నాయి. ఈ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కాంట్రాక్టర్కే టెండర్ దక్కుతుంది. ఒక జోన్ భౌగోళిక పరిధిలో ఉన్నవారే ఆ జోన్ టెండర్లో పాల్గొనాలి. అది కూడా పౌల్ట్రీ యజమానికి మాత్రమే అర్హత ఉంటుంది. లీజు పద్ధతిలో కొనసాగే రైతుకు అవకాశం లేదు. రాష్ట్రంలో 650 మంది పౌల్ట్రీ రైతులు (లేయర్) ఉన్నట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
⇒ టెండర్ నిబంధనల్లో ఈసారి రెండు మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిపైనే రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో పౌల్ట్రీ రైతుకు అగ్మార్క్ ధ్రువీకరణ పత్రం ఉండాలనే నిబంధన ఉండేది. తాజా ఈ ధ్రువీకరణ పత్రం టెండర్ తేదీకి కనీసం రెండేళ్ల ముందు నుంచే చెల్లుబాటు అయ్యేలా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో కొత్తగా అగ్మార్క్ ధ్రువీకరణ తీసుకున్న వారికి ఈసారి టెండర్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ నిబంధన గతంలో టెండర్ దక్కించుకున్నవారికే మళ్లీ టెండర్ దక్కేలా ఉందని పౌల్ట్రీ రైతులు ఆరోపిస్తున్నారు.
⇒ అగ్మార్క్ ధ్రువీకరణతోపాటు అగ్మార్క్ రిప్లికా సీరియల్ నంబర్ కూడా కలిగి ఉండాలని తాజా టెండర్లో కొత్త నిబంధన పెట్టారు. ఇది కూడా గత టెండర్లో ఎంపికైన కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉంది. మరోవైపు అగ్మార్క్ రిప్లికా నంబర్ టెండర్ ప్రారంభమైన తేదీ కంటే ముందే ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో కొత్తగా ఈ నంబర్ తీసుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
⇒ అగ్మార్క్ అనేది వ్యవసాయ ఉత్పత్తుల ప్రామాణిక నాణ్యతను ధ్రువీకరిస్తుంది. అగ్మార్క్ రిప్లికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రామాణికతతోపాట ఆ ఉత్పత్తి గ్రేడు ప్రమాణాలను నిర్ధారిస్తుంది.
గడువుపైనా గందరగోళం (బాక్స్)
టెండర్ ప్రక్రియ గడువుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియ మార్చి 30న ప్రారంభమై ఏప్రిల్ 10న ముగుస్తుంది. అయితే, మార్చి 30, 31, ఏప్రిల్ 1, 5, 6వ తేదీలు ప్రభుత్వ సెలవుదినాలు. టెండర్ గడువు మొత్తం 12 రోజులు కాగా... ఇందులో ఏకంగా 5 రోజులు సెలవు దినాలే. ఇక మిగిలింది ఏడు రోజులు మాత్రమే. గతంలో 17 రోజులపాటు సమయం ఇవ్వగా.. ఈసారి 12 రోజులకు కుదించారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఈ తేదీలను ఖరారు చేశారని మండిపడుతున్నారు. ఈ టెండర్ విషయంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.