పార్కింగ్‌ కష్టాలకు చెక్‌ | Multi-level parking complex in Hyderabad | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ కష్టాలకు చెక్‌

Jan 14 2025 6:58 AM | Updated on Jan 14 2025 9:26 AM

Multi-level parking complex in Hyderabad

తుది దశలో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ పనులు 

ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు  

 కాంప్లెక్స్‌ ప్రారంభమైతే తీరనున్న పార్కింగ్‌ సమస్య  

నుమాయిష్‌ సందర్శకులకు ఊరట

నాంపల్లి: మెట్రో రైలు ప్రయాణికులకు పార్కింగ్‌ తిప్పలు తప్పనున్నాయి. నాంపల్లిలో నిర్మిస్తున్న అధునాతన మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రయల్స్‌ కూడా నిర్వహించారు. 

ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే నాంపల్లి ప్రాంతంలో టూ వీలర్, ఫోర్‌ వీలర్‌ పార్కింగ్‌ సమస్య నుంచి గట్టెక్కడమే కాకుండా ట్రాఫిక్‌ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికితోడు నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే నుమాయిషి కు వచ్చే సందర్శకులు పార్కింగ్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, వివిధ పారీ్టలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వచ్చే నేతలు, కార్యకర్తలు  నిత్యం పార్కింగ్‌ సమస్యతో  ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏవైనా సభలు, సమావేశాలు జరిగినా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  

బహుళ అంతస్తుల్లో.. 
నాంపల్లి కేంద్రంగా కంప్యూటరైజ్డ్‌ మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ నిర్మాణం కోసం 2018లో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే  పూర్తి కావాల్సిన కాంప్లెక్స్‌  నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ పనులను ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ చేపడుతోంది. పూర్తి జర్మన్‌ టెక్నాలజీతో నగరంలో తొలి మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కావడం గమనార్హం. ఈ కాంప్లెక్స్‌లో  మొత్తం 15 అంతస్తులు ఉన్నాయి. 10 అంతస్తులను పార్కింగ్‌కు కేటాయించారు. మిగతా ఐదు అంతస్తుల్లో రెండు సినిమా స్క్రీన్లతో ఒక థియేటర్, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపార సముదాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ పార్కింగ్‌ అందుబాటులోకి వస్తే 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలను పార్కింగ్‌ చేసుకునే వీలుంది. 

కారుకు గంటకు రూ.30, టూ వీలర్‌కు గంటకు రూ.10 చొప్పున వసూలు చేయనున్నారు. మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లో బీ1, బీ2, బీ3 అండర్‌ గ్రౌండ్‌ అంతస్తులు ఉంటాయి. 5 నుంచి 11 అంతస్తుల వరకు పార్కింగ్‌ కోసం కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పార్కింగ్‌కు సంబంధించి నాలుగు ఎంట్రీ ఎగ్జిట్‌ టెర్మినల్స్‌ ఉంటాయి. ఆయా టెరి్మనల్స్‌ వద్ద ఉన్న టర్న్‌ టేబుల్స్‌పై వాహనాలను వదిలితే లిప్టుల ద్వారా నిరీ్ణత అంతస్తుకు చేరుకుంటాయి. సైజును బట్టి తగిన ప్లాట్లలో పార్కింగ్‌ చేస్తారు. పార్కింగ్‌ ప్రక్రియకు కేవలం ఒక్క నిమిషం మాత్రమే సమయం పట్టనుంది. 

కార్లను తిరిగి తీసుకోవడానికి టర్న్‌ టేబుల్స్‌ వద్దనున్న కార్లను రీడర్ల వద్ద స్మార్ట్‌ కార్డును స్వైప్‌ చేస్తే.. కారు నిరీ్ణత టర్న్‌ టేబుల్‌ వద్దకు చేరుకుంటుంది. టర్న్‌ టేబుల్‌పై ఉన్న కారును రివర్స్‌ చేసే బాధ లేకుండా టర్న్‌ టేబులే మన  వాహనాన్ని కావాల్సిన దిక్కుకు రొటేట్‌ చేస్తుంది. దీంతో పార్కింగ్‌  నుంచి కారును రెండు నిమిషాల్లోనే బయటికి తీసేందుకు వీలవుతుంది.  ఇక పార్కింగ్‌ చార్జీలు చెల్లించేందుకు స్మార్ట్‌ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా పార్కింగ్‌ చేసేవారికి ఆర్‌ఎఫ్‌ఐడీ స్మార్ట్‌ కార్డులను జారీ చేయనున్నారు. మెట్రో ఎండీ ఎనీ్వఎస్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రారం¿ోత్సవానికి సన్నాహాలు ముమ్మరం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement