
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గంటన్నరపాటు ప్రశ్నించి ఈటల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంత కాలం సాగదీస్తారు?. ఎంత కాలం విచారణ జరుపుతారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంకెంత కాలం విచారిస్తారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్రావు నియామకమే అక్రమం. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. అనేకసార్లు నా ఫోన్ ట్యాప్ చేశారు. రాజకీయ నేతలే కాదు.. జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లూ ట్యాప్ చేశారు. గవర్నర్ ఇంద్రాసేనా రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు.
ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు?. ఎవరి అండతో ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇప్పటికైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్న చట్టపరంగా శిక్షించాలి.. అని ఈటల డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సాక్షుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. బీజేపీ లీగల్ సెల్తో కలిసి సిట్ కార్యాలయానికి సాక్షిగా ఇవాళ్టి విచారణకు ఈటల హాజరయ్యారు. బీజేపీ నేత ప్రేమేందర్ స్టేట్మెంట్ను కూడా అధికారులు నమోదు చేశారు.