జన సం‍ద్రంగా మారిన మేడారం.. పోలీసుల ఓవరాక్షన్‌ | Medaram Sammakka Jatara 2026 Jan 30 News Updates | Sakshi
Sakshi News home page

జన సం‍ద్రంగా మారిన మేడారం.. పోలీసుల ఓవరాక్షన్‌

Jan 30 2026 6:40 AM | Updated on Jan 30 2026 10:54 AM

Medaram Sammakka Jatara 2026 Jan 30 News Updates

సాక్షి, హైదరాబాద్‌: మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. కిలోమీటర్ల మేరన ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

మేడారం వీధులన్నీ సమక్క, సారలమ్మ నామఃస్మరణలతో మారుమోగుతోంది. తమను, తమవాళ్లను చల్లంగా చూడాలంటూ వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది.  ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. 

వీఐపీల తాకిడి..
మేడారం మహాజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తులాభారం వేసి తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) పంచిపెడుతున్నారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

పోలీసుల ఓవర్ యాక్షన్

వీఐపీ భద్రత పేరుతో పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి స్పెషల్‌ గేట్ ద్వారా వందలాది పోలీసులు సమ్మక్క- సారలమ్మ గద్దెల వైపు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తల్లుల దర్శనం కావడం లేదు. గద్దెల ప్రాంగణమంతా పోలీసులే ఉండడంతో.. అడ్డు తొలగాలని స్థానిక అధికారులు పదే పదే మైకుల్లో చెప్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వీఐపీలు అరకోరగా వస్తున్నప్పటికీ.. వాళ్ల భద్రత పేరిట పోలీసులు అతికి దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సమ్మక్క తల్లి నామస్మరణతో..
చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే జాతర ప్రధాన ఘట్టం గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై.. రాత్రి 9:58గంటలకు గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్ఠించే వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. అడవి తల్లి రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలకలగుట్ట వైపు చూశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన పూజారులు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా, అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఏకే–47 తుపాకీతో  4 విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement