ఢిల్లీ: సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) స్పందించింది. ప్రముఖుల టూర్లను పొలిటికల్ క్లియరెన్స్ కోసం పరిశీలిస్తాం.. పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా కార్యక్రమం ఉండాలని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. యూఎస్ పర్యటన విషయంలో అలా లేదు కాబట్టి నిరాకరించామని ఎంఈఏ తెలిపింది.
ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు వారి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందన్న జైస్వాల్.. సంబంధిత పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా కార్యక్రమం ఉండాలని.. అయితే, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణానికి అనుగుణంగా కార్యక్రమం లేదని, అందుకే అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత 24 నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి నిరాకరణ రావడంతో అమెరికా పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో సీఎం పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


