మృతదేహంతో గంటపాటు పరుగులు పెట్టిన గేదె
బైక్ ప్రమాదంలో తలలోకి చొచ్చుకుపోయిన కొమ్ము..
యువకుడు మృతి.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఘటన
తెలంగాణ: గేదెను బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారంగేట్ సమీపంలో 765డీ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది.
ఏఎస్ఐ ఆండాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆకుల దుర్గాప్రసాద్ (19), రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన మహేశ్ బైక్పై నర్సాపూర్ వైపు నుంచి ఇంటికి వెళ్తున్నారు. అంతారంగేట్ సమీపంలో జాతీయ రహదారిపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి వాటిని ఢీకొంది. దుర్గాప్రసాద్ తలలో గేదె కొమ్ము చొచ్చుకుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
గేదె కొమ్ము తలలో గుచ్చుకుపోవడంతో మృతుడి శరీరం గేదె మెడకు వేలాడింది. దీంతో గేదె గంటపాటు అటు ఇటు పరుగులు పెట్టింది. స్థానికులు, ప్రయాణికులతో కలిసి పోలీసులు గంటపాటు శ్రమించి గేదెను కిందపడేసి కొమ్ము నుంచి మృతుని తలను తొలగించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


