నా ఆస్తిని అక్రమంగా పట్టా చేసుకున్నారు.. దీంతో మహిళ!

Married Women Commit Suicide On Property Issue In Mahabub Nagar - Sakshi

దామరగద్ద (మహబూబ్‌నగర్‌) : తమకు దక్కాల్సిన ఆస్తిని తమకు తెలియకుండా బంధువు పట్టాచేయించుకోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ గ్రామానికి చెందిన ఆశప్పకు నలుగురు కూతుళ్లు.. అందులో పెద్దకూతురు హన్మమ్మ కాగా, మరో కూతురు మాణిక్యమ్మ. అప్పట్లో పెద్దకూతురు హన్మమ్మను హన్మంతుకు ఇచ్చి వివాహం చేశారు.

అనంతరం ఆశప్ప మృతి చెందడంతో ఆస్తిని నలుగురు అక్కా చెల్లెళ్లకు తెలియకుండా హన్మంతు పట్టా చేయించుకున్నాడు. విషయం తెలిసిన హన్మంతు భార్య హన్మమ్మ.. రెండు రోజుల క్రితం భర్తతో వాగ్వాదానికి దిగింది. తమ చెల్లెళ్లకు దక్కాల్సిన ఆస్తిని వారికే ఇవ్వాలని అడగడంతో ఆమెపై భర్త  దాడి చేశాడు. కాగా, నలుగురు కూతుళ్లలో ఒకరైన మాణిక్యమ్మకు సైతం కూతురు గోవిందమ్మ ఉంది. ప్రస్తుతం ఈమె ఆందోళనకు దిగింది.

తన తల్లికి చెందిన భూమిని వరుసకు పెద్దనాన్న అయిన హన్మంతు బెదిరించి పట్టా చేయించుకున్నాడని, ఇటీవల ఆయన సొంత అల్లుడు నర్సింహులు పేరున పట్టా మార్పిడి చేయించాడని వాపోయింది. మనస్థాపం చెందిన గోవిందమ్మ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయడం లేదని బాధితురాలు వాపోయింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top