సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బీదర్, మల్గి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వివరాల మేరకు.. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో చెత్తను అక్కడ పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త డంపింగ్ కారణంగా తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిని బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు బీదర్కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి, బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్తను మున్సిపల్ అధికారులు పారబోసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. బీదర్, మల్గి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


