
‘స్థానిక’ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
పోలింగ్కు బీఆర్ఎస్ గైర్హాజరు..
ఓట్లేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు.
మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు.