ఆగస్టు 15 కల్లా భూసమస్యల పరిష్కారం | Land issues to be resolved by August 15th | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15 కల్లా భూసమస్యల పరిష్కారం

Jun 16 2025 3:27 AM | Updated on Jun 16 2025 3:27 AM

Land issues to be resolved by August 15th

7,578 రెవెన్యూ సదస్సుల్లో 4.61లక్షల దరఖాస్తులు

వారం, పది రోజుల్లో ఆ 5 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తాం

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌/కూసుమంచి: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న భూసమస్యలను ఆగస్టు 15వ తేదీకల్లా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆదివారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని 561 మండలాల్లోని 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. 

ఈ సదస్సులను 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృక్పథంతో పరిష్కార మార్గం చూపాలని అధికారులను కోరారు. పదేళ్లలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతోనే సీఎం రేవంత్‌రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి రైతులకు మేలు చేసే బాధ్యత అధికారులదేనని చెప్పారు. 

వేగంగా భూసర్వే
రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాలకుగాను ఐదింట జరుగుతున్న రీసర్వే నిర్వహణ గురించి కూడా మంత్రి పొంగులేటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెల మూడోవారం నుంచి ఈ పైలట్‌ సర్వే నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సలార్‌నగర్‌లో 422 ఎకరాలకు 337 ఎకరాలు, కొమ్మనాపల్లి (కొత్తది) గ్రామంలో 626 ఎకరాలకు 269 ఎకరాలు, ములుగుమడలోని 845 ఎకరాలకు 445 ఎకరాలు, నూగురులో 502 ఎకరాలకు 232 ఎకరాలు, షాహిద్‌నగర్‌లో 593 ఎకరాలకు 308 ఎకరాల్లో సర్వే పూర్తయ్యిందని వివరించారు.

అనంతరం పొంగులేటి మాట్లాడుతూ మరోవారం, పది రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్న వివాదాలకు కూడా తావు లేకుండా రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. భూముల సర్వే కారణంగా రైతులు, గ్రామీణ భూయజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు. 

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి 
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, సోమవారం జరిగే కేబినెట్‌ సమావేశంలో తేదీలపై స్పష్టత వస్తుందని  మంత్రి పొంగులేటి  చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆదివారం పాలేరు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కొద్దిరోజుల్లో రైతు భరోసా నిధులు విడుదలవుతాయని, సన్నధాన్యం అమ్మిన రైతులకు బోనస్‌ చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కూసుమంచిలో పొలం దున్నిన పొంగులేటి.. కూలీలతో కలిసి విత్తనాలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement