డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచి్చరెడ్డి మద్దతునిచి్చన సందర్భంగా మాట్లాడుతున్న మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు
టీజీఈజేఏసీతో కలిసి పనిచేస్తామన్న వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటం మరింత బలపడింది. ఇప్పటివరకు రెండు జేఏసీలుగా కొనసాగుతున్న ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ)కి రాష్ట్ర చైర్మన్గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతుండగా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మరో జేఏసీ కొనసాగుతోంది. కొంతకాలంగా ఈ రెండు జేఏసీలు ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై వేర్వేరుగా ప్రకటనలు, నిరసనలు చేపడుతున్నాయి. ఇటీవల పెన్షన్ విద్రోహదినం, ఇతర నిరసనలను కూడా వేర్వేరుగా నిర్వహించడంతో ఉద్యోగ వర్గాల్లో గందరగోళం నెలకొంది. విడివిడిగా ఉద్యమిస్తుండటం వల్ల ప్రభుత్వ హామీల అమలు, సమస్యల పరిష్కారం వేగవంతం కావట్లేదనే భావన ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. దీంతో ఈ సందిగ్ధతకు టీజీఈజేఏసీ చెక్ పెట్టింది. వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని జేఏసీ మద్దతు కోరగా ఆయన వెంటనే టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావుతో సోమవారం భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడేందుకు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఉద్యోగుల కోసం చేస్తున్న ఉద్యమంలో టీజీఈజేఏసీతో కలిసి ఉంటానని లచ్చిరెడ్డి వెల్లడించారు.
‘చలో హైదరాబాద్’తప్పకుండా నిర్వహిస్తాం: మారం జగదీశ్వర్
ఈ నెల 10న చలో హైదరాబాద్ నిరసనను తప్పకుండా నిర్వహిస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని టీజీఈజేఏసీ తీర్మానించింది. సోమవారం టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీజీఈజేఏసీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చలో హైదరాబాద్కు ప్రతి ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావాలని చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అన్ని సంఘాల ప్రతినిధుల ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ‘మన హక్కుల సాధన కోసం ఐక్యంగా కదులుదాంం. చలో హైదరాబాద్ను విజయవంతం చేద్దాంం. లక్ష మందితో హైదరాబాద్ను కదిలిద్దాం’అని నినాదాలు చేశారు.


