వారం రోజుల్లో తొలి విడుత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్‌ | KTR meeting With HYD Ministers Of Double Bedroom Houses distribution | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో తొలి విడుత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్‌

Aug 16 2023 1:31 PM | Updated on Aug 16 2023 1:52 PM

KTR meeting With HYD Ministers Of Double Bedroom Houses distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్‌లో బుధవారం జరిగిన ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి
కాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. 

లక్ష ఇండ్ల నిర్మాణమే​ లక్ష్యంగా
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో  లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పూర్తి అయిందని పేర్కొన్నారు. ఇందులో సుమారు 4,500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని  తెలిపారు.  నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని  తెలిపారు.

వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందదన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు పలు సూచనలను తెలియజేశారు. డఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని  తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తుందని మంత్రులు తెలిపారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement