వీడిన సస్పెన్స్‌.. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి | Sakshi
Sakshi News home page

వీడిన సస్పెన్స్‌.. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి

Published Sun, Apr 9 2023 3:04 PM

KTR About BRS Party Foundation Day celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఆదివారంక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించుకుంటున్న బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపిన కేటీఆర్, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.  

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకం
కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ నియమించారు.  గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జీగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీగా ఎంపీ మాలోతు కవితలను పార్టీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగనున్నారు.

ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని,  జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్ధలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. 

ఏప్రిల్‌ 25వ తేదీన రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరగుతుందని, ఈ సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500-3000 మంది ప్రతినిధులతో నిర్వహించుటామన్నారు.

ఏప్రిల్ 27న తెలంగాణ భవన్‌లో వేడుకలు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ రోజు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కేటీఆర్‌ తెలిపారు. 27న తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సూమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

ఆరోజు ఉదయం కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ పార్టీ జెండాను ఎగరవేసి ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభిస్తారని, ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ/ విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10వ తేదిన భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభ నిర్వహణ  జరుగుతుందన్నారు.

మే నెలాఖరు వరకు  ఆత్మీయ సమ్మేళనాలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పట్ల కెసిఆర్ గారు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement