దళిత కాలనీలోనే కలెక్టర్‌ భోజనం, నిద్ర  | Sakshi
Sakshi News home page

దళిత కాలనీలోనే కలెక్టర్‌ భోజనం, నిద్ర 

Published Fri, Feb 25 2022 5:15 AM

Khammam: Collector Gautham Madhira Had Meal And Sleep In Dalith Colony - Sakshi

మధిర: ఎస్సీల సాధికారతకు ప్రవేశపెట్టిన దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ మధిర నియోజకవర్గంలో రొంపిమళ్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. దళితబంధు పథకానికి ఎంపిక చేసిన మాతంగి రమణ, రాజ్‌కిరణ్, గొల్ల మందల శ్రీనివాసరావుతోపాటు పలువురి ఇళ్లకు గురువారం రాత్రి అధికారులతో కలిసి వెళ్లిన కలెక్టర్‌.. వారి అర్హతలపై ఆరా తీశారు. స్వేచ్ఛగా యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.

నిర్దేశిత యూనిట్లపై కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. అనంతరం లబ్ధిదారుడైన గొల్లమందల శ్రీనివాసరావు ఇంట్లోనే కలెక్టర్‌ సహా అధికారులందరూ రాత్రి 10గంటలకు భోజనం చేశారు. అంతకుముందు హోటల్‌ నుంచి తెప్పించిన చపాతీ, ఇడ్లీ తిన్నారు. అనంతరం లబ్ధిదారుడైన శ్రీనివాసరావు భార్య సునీతను ఇంట్లో ఏం చేశారని కలెక్టర్‌ అడిగారు. అన్నం, టమాటా – పచ్చిమిర్చి చట్నీ, పెరుగు అని చెప్పగా, అవే తనకు వడ్డించాలన్న కలెక్టర్‌... వారితోపాటు భోజనం చేశారు. శ్రీనివాసరావు ఇంట్లోనే కలెక్టర్‌ సహా అధికారులు నిద్రించారు. శుక్రవారం ఉదయం కూడా దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై అవగాహన కల్పించనున్నారు. 

Advertisement
Advertisement