సాక్షి, ఖమ్మం జిల్లా: మార్పులకు అనుగుణంగా అప్డేట్ కాని అంబాసిడర్ కారు కనుమరుగయ్యిందని సింగరేణి అలా కాకూడదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ ఓసీ-2 గనుల పరిశీలన సందర్భంగా బొగ్గు నాణ్యతపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి సింగరేణి అడుగుపెట్టాలని సూచించారు.
బొగ్గు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఓబీ, బొగ్గు కలవకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కూడా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణతో పాటు ఖనిజ బ్లాకుల వేలాల్లో పోటీ పడాలని సూచించారు.
ప్రైవేట్ సంస్థలు, దిగుమతి బొగ్గు పోటీని ఎదుర్కోవాలంటే తక్కువ వ్యయంతో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోల్ బ్లాకుల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.


