సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని.. ఈ సీజన్ వరి పంట వేయొద్దని సర్కార్ హెచ్చరించింది. బోరు బావుల కింద సైతం వరి సాగు చేయొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎల్నినోపై ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, నైరుతి సీజన్ రెండో మాసం కూడా వర్షాభావ పరిస్థితులే నమోదవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. సాధారణంగా జూన్లో పెద్దగా వర్షాలు కురవకున్నా జూలై రెండో వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వానలు ఊపందుకుంటాయి. కానీ ఈసారి నైరుతి సీజన్లో వానల నమోదు లోటులో ఉంది.
ఎల్నినో పరిస్థితులున్నప్పటికీ జూన్, జూలై నెలల్లో వానలు సాధారణ స్థితిలో నమోదవుతాయని ఐంఎండీ ముందస్తు అంచనాల్లో ప్రకటించినప్పటికీ... వరుసగా రెండు నెలలు లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్లో 12శాతం లోటు వర్షపాతం నమోదు కాగా... ఈనెల 20 నాటికి 49 శాతం లోటు నమోదు కావడం... ఈ వారాంతం వరకు కూడా వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్న ప్రకటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.


