హైదరాబాద్: కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు అప్పులే కాదా? అంటూ మాజీ మంత్రి కేటీఆర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మిషన్ భగీరథ పేరుతోనే రూ.40 వేల కోట్ల అప్పు తెచ్చారని అన్నారు.
జూపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్పొరేషన్ల అప్పును నేను నిరూపిస్తా.. నేను చెప్పిన లెక్క తప్పు అయితే రాజీనామా చేస్తా.. చర్చకు మీ బీఆర్ఎస్ భవన్కు రావడానికి సిద్ధం. నేను చెప్పిన లెక్క తప్పు అయితే ఈ రోజే రాజీనామా చేస్తాను. నేను చెప్పింది అబద్దం అయితే స్పీకర్కు నా రాజీనామాను ఇస్తాను.
అప్పుల గురించి ఇజ్జత్ పోతుందని మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనించే మిమ్మల్ని గద్దె దించారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది సోనియా గాంధీ. తామే తెచ్చామని చెప్పుకోవడం బీఆర్ఎస్ వాళ్ల భ్రమ. బీజేపీ మూడు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం కూడా బీజేపీనే. తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాల వల్ల రాష్టం ఏర్పడింది’’ అని విమర్శించారు.
పాత ముచ్చట్లు చెబుతున్నారు..
కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పాత ముచ్చట్లు చెబుతున్నారని జూపల్లి చెప్పారు. ‘‘50 శాతం ఈ ప్రభుత్వం టర్మ్ అయిపోయింది.. ఏం చేసిందో ప్రభుత్వం చెప్పుకోవడం లేదంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తీరు దేశం మొత్తం చూసింది. త్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్టం. మిగులు బడ్జెట్, ధనిక రాష్టం, తర్వాత రూ.8 లక్షల కోట్లు అప్పు.. ఇది బీఆర్ఎస్ పరిపాలన తీరు. తాము చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నారు కేటీఆర్.
కేసీఆర్కు, కేటీఆర్కు చిన్న మెదడు, పెద్ద మెదడుకు చిల్లు పడి రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న రూ.2 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? రూ.20 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇది ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలా? బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవి అన్ని అబద్ధాలు’’ అని అన్నారు.


