
దొరల ఆధిపత్యానికి, రక్షణకు చిహ్నం
కళాశాలకు దానం చేసిన మాజీ ఎంపీ సురేందర్రెడ్డి
ప్రస్తుతం చదువుల బడిగా విలసిల్లుతున్న గడి
ఒకప్పుడు తెలంగాణలో సంస్థానాదీశులు, దొరలు విశాలమైన గడీల నుంచి పరిపాలన సాగించారు. ఆ గడీలను అధికార కేంద్రంగా చేసుకుని ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపేవారు. తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.. గ్రామాల్లో తమ గడీలను కేంద్రంగా చేసుకుని పాలించారు. –మరిపెడ రూరల్
200 ఏళ్లపాటు గడీల పాలన..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని గడి కేంద్రంగా సుమారు 200 ఏళ్లపాటు పరిపాలన కొనసాగింది. ఐదెకరాల విశాలమైన స్థలంలో గడిని నిర్మించారు. చుట్టూ 20 అడుగుల ఎత్తు గోడ నిర్మించారు. ఈ గడి కేంద్రంగా మాజీ ఎంపీ ఆర్.సురేందర్రెడ్డి కుటుంబ సభ్యులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. వందలాది మంది అనుచరులు, గుమాస్తాల ద్వారా పాలన నడిపించేవారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో గడీల పాలనకు తెరపడింది.
1995 నుంచి ఖాళీగా..
దొరల పాలన ప్రాబల్యం తగ్గిన తర్వాత.. 1995లో మరిపెడ గడిలోని దొరలు పట్టణ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొంతకాలంగా కుడితి లక్ష్మారెడ్డి అనే గుమాస్తా.. మరిపెడ గడిని, ఆస్తులను కాపాడుకుంటూ వచ్చారు. కొంతకాలం గడిలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలను నడిపించారు. 1997లో మరిపెడకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. భవనం లేకపోవడంతో మరిపెడ దామోదర్రెడ్డి హైసూ్కల్లోని ఒక భవనంలో జూనియర్ కళాశాల కొనసాగిస్తూ వచ్చారు.
కళాశాలకు ధారాదత్తం..
సొంత భవనం లేక ఇరుగ్గా ఉన్న స్కూల్ గదుల్లో కళాశాల కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడ్డారు. కాగా గడి ఖాళీగా ఉందని.. దానిని కళాశాలకు దత్తత ఇస్తే బాగుంటుందని అప్పటి ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ గ్రామ పెద్దల దృష్టికి తెచ్చారు. అప్పుడు గడిని రక్షిస్తున్న గ్రామ పెద్ద ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీ ఆర్.సురేందర్రెడ్డి ఈ అంశంపై చర్చించారు. వెంటనే దాత సురేందర్రెడ్డి.. గడిని ఈ ప్రాంత పేద విద్యార్థుల ప్రయోజనం కోసం కళాశాలకు ధారాదత్తం చేస్తున్నట్లు ప్రకటించారు.
చదువుల ఒడిగా..
గడి ఆవరణలోని భవనంలో కొంతకాలంగా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగింది. అనంతరం అప్పటి మంత్రి డీఎస్ రెడ్యానాయక్ కృషి ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం మంజూరైంది. 2008లో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంత విద్యార్థులకు మరిపెడ గడి చదువుల ఒడిగా కొనసాగుతోంది.
ఆహ్లాదకరంగా కళాశాల
ఐదెకరాల విస్తీర్ణంలోని గడీలో నిర్మించిన భవనం వృక్ష సంపద మధ్య ఆహ్లాదకరంగా ఉంది. విశాలమైన గదులు, అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులతో ప్రైవేటు కళాశాలలకు దీటుగా కొనసాగుతోంది. రూ.కోట్ల విలువైన గడిని పేద విద్యార్థుల శ్రేయస్సు కోసం దానం చేయడం దాత సురేందర్రెడ్డి గొప్పతనం. – వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఆహ్లాదకరంగా కళాశాల
ఐదెకరాల విస్తీర్ణంలోని గడీలో నిర్మించిన భవనం వృక్ష సంపద మధ్య ఆహ్లాదకరంగా ఉంది. విశాలమైన గదులు, అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులతో ప్రైవేటు కళాశాలలకు దీటుగా కొనసాగుతోంది. రూ.కోట్ల విలువైన గడిని పేద విద్యార్థుల శ్రేయస్సు కోసం దానం చేయడం దాత సురేందర్రెడ్డి గొప్పతనం. – వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల